
- ఏడాదిన్నరగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ రాద్ధాంతం
- కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై దుష్ప్రచారం చేస్తున్నయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపొనెంట్లలో కేవలం ఒక్క చోట రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా రిపేర్లు చేయకుండా రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో బీజేపీ ఆఫీసులో ఎన్డీయే రిపోర్ట్ను తయారు చేసి, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.
పాలమూరు–--రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తి చేశారు. దశాబ్దాలపాటు సాగునీటి కోసం తండ్లాడిన రైతులకు నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన దార్శనికుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు కేసీఆర్ శ్రీరామ రక్ష’’అని అన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెత్తబుట్టలో పడేయడానికి తప్ప దేనికీ పనికిరాదంటూ ఎల్అండ్ టీ సంస్థ తేల్చి చెప్పిందని అన్నారు. ‘‘పార్లమెంట్ నూతన భవనం కట్టిన ఎల్ అండ్ టీ సంస్థనే మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది.
తెలంగాణ నుంచి సీఎం పంపిన మూటలతోనే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని నిర్మించుకున్నది. అది కూడా ఎల్ అండ్ టీ సంస్థే కట్టింది. సంస్థపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ ఆఫీసును ఎందుకు కట్టించారు? కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణ రైతుల బొండిగ పిసికే కుట్ర చేస్తున్నాయి. జిల్లాల దాకా వెళ్లి వాస్తవాలు చెప్తం. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతు చేసి రైతులకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా.. కుంటిసాకులతో కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది’’అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు
కాంగ్రెస్, బీజేపీ నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరంపై ఆ రెండు పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే హరీశ్ రావు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు చెప్పారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందని, నిజాలు ప్రజలకు తెలిసేలా చూడాలని హరీశ్ రావును తానే కోరానని వెల్లడించారు. తెలంగాణ ఉద్య మ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయా యని అన్నారు. పాలనచేతగాని సీఎం, కాంగ్రెస్ సర్కారు.. ఉద్యమ నినాదానికి పాతరేసి దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నదని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నా సీఎం, మంత్రులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన 2 రోజులకే ఎన్డీఎస్ఏ ఇక్కడ వాలిపోయిందన్నారు. ‘‘గుజరాత్ లో మోర్బీ బ్రిడ్జి కూలి 140 మంది చనిపోయినా ఎన్డీఎస్ఏగానీ, ఏ ఏజెన్సీగానీ ఇప్పటిదాకా నోరు మెదపలేదు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలినా ఎన్డీఎస్ఏ రాదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది చనిపోయినా ఎన్డీఎస్ఏ విచారణ చేయదు. వట్టెం పంప్హౌస్ మునిగినా, పెద్దవాగు కట్ట కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు?’’అని కేటీఆర్ ప్రశ్నించారు.