సీఎం కుమారుడు… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్కు సొంత నియోజకవర్గంలో ఓట్ల గ్రాఫ్ పడిపోయింది. ఫలితంగా కరీంనగర్ సిట్టింగ్సీటును టీఆర్ఎస్ గెలుచుకోలేక పోయింది. అక్కడ పోటీలో ఉన్న సిట్టింగ్ఎంపీ, సీఎం సమీప బంధువైన వినోద్కుమార్ ఘోర పరాజయానికి దారి తీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీకి కంచుకోటగా పేరున్న కరీంనగర్లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరోసారి చేదు ఫలితాన్ని చవి చూసింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89508 ఓట్ల మెజారిటీతో వినోద్కుమార్పై విజయం సాధించారు. కేటీఆర్ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్కరీంనగర్నియోజకవర్గ పరిధిలోనే ఉంది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 89009 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నాలుగు నెలల్లోనే జరిగిన లోక్సభ ఎన్నికలకల్లా సీన్ మారిపోయింది. కేటీఆర్ సొంత సెగ్మెంట్లో టీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండి పడింది. సిరిసిల్లలో నాలుగు నెలల కిందట కేటీఆర్కు 1,25,213 ఓట్లు వస్తే ఇప్పుడు వినోద్కుమార్కు 70482 ఓట్లే పడ్డాయి. అంటే అర లక్షకు పైగా గండి. ఇది గులాబీ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో కేవలం మూడు వేల ఓట్లు సాధించి నాలుగో స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. ఇక్కడి ఓటర్లు బీజేపీకి 64769 ఓట్లను కట్టబెట్టి ఆ పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరిసిల్లలో కేవలం 5713 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ పరువు నిలబెట్టుకున్నప్పటికీ.. ఇదే జిల్లాలోని వేములవాడ సెగ్మెంట్లో అట్టర్ ప్లాఫ్ అయింది. అక్కడ టీఆర్ఎస్పై బీజేపీ అన్ని మండలాల్లోనూ పై చేయి సాధించింది. ఏకంగా 25891 ఓట్ల మెజారిటీతో అందనంత ముందుకు దూసుకెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్ సొంత ఇలాఖాలో ఇంత దారుణంగా ఫలితాలు రావటం గులాబీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేశాయి. స్వయంగా కేటీఆరే ఇక్కడ ఎంపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను సైతం స్వీకరించారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికో… భారీ బహిరంగ సభ పెట్టి జనాన్ని సమీకరించారు. అంత జేసినా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ నాయకత్వం పట్టించుకోకపోవటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఇమేజీ గెలిపిస్తుందని, సారు..కారు..పదహరు అనే నినాధంతో ఓట్లు రాలుతాయని, సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమకు ఓట్లు వేస్తారని ఇక్కడి జిల్లా, మండల స్థాయి నాయకులు గట్టిగా నమ్మారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చిందని ఎంపీ ఎన్నికలను తేలిగ్గా తీసుకొని పల్లెల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ పుంజుకోవటంతో ఎంపీ సీటును కైవసం చేసుకొనే అవకాశాలన్నీ మిస్సయ్యాయి. ప్రధానంగా జిల్లాలోని టీఆర్ఎస్ నేతల అతినమ్మకమే కొంప ముంచిందని చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలు సైతం పార్టీని వెంటాడుతున్నాయి. పలు మండలాల్లో మండల నాయకుల పనితీరు.. వారిపై వస్తున్న విమర్శలపై అప్రమత్తమైన కేటీఆర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కొందరిని పక్కనపెట్టారు. అప్పటికే జరిగిన ఎంపీ ఎన్నికల్లో.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. మరోవైపు టీఆర్ఎస్ లోని ఒక వర్గం లోపాయకారీగా బీజేపీకి సపోర్ట్ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ ఇలాకాలో క్యాడర్ లేని బీజేపికి కారు గుర్తుతో పోటాపోటీగా ఓట్లు పడటం చర్చనీయాంశమైంది