ఈ సన్నాసులు..ఆ చెత్త నా కొడుకుల్ని అడగాలె.. సహనం కోల్పోయిన కేటీఆర్

 ఈ సన్నాసులు..ఆ చెత్త నా కొడుకుల్ని అడగాలె..  సహనం కోల్పోయిన కేటీఆర్

యాదాద్రి, వెలుగు:  బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సహనం కోల్పోయారు. చెత్త నాకొడుకులు, ఈ నాకొడుకులు అంటూ విరుచుకుపడ్డారు. వీపులు సాప్​చేస్తమంటూ.. పోలింగ్​ రోజున ఎవ్వడు అడ్డమొచ్చినా తొక్కుకుంట పోవుడే.. గెలుసుడే అంటూ రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో నిర్వహించిన రోడ్​ షోలో ఆయన  పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ స్కీమ్స్​ గురించి వివరిస్తూ వందల పథకాలు తెచ్చిన కేసీఆర్​ను గెలిపించుకుందామా? ఓటుకు నోటు దొంగలను గెలిపించుకుందామా? అని ప్రశ్నించారు. సరిగ్గా అదే సమయంలో కొందరు యువకులు ఎదురుగా ఉన్న బిల్డింగ్​ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఎక్కడ? కేజీ టు పీజీ ఏమైంది? ప్రభుత్వ డిగ్రీ కాలేజీలెక్కడ ? అని నినాదాలు రాసి ఉన్న  ప్లకార్డులు కేటీఆర్​ వైపు చూపించారు. అప్పటికే ఆలస్యం కావడం, దీనికి తోడుగా యువకులు ప్లకార్డులు ప్రదర్శించడంతో కేటీఆర్​ సహనం కోల్పోయారు. 

అవతోలిడికి ఓటేసి ఇవతలోన్ని పన్జేయాలంటే ఎట్ల?

‘‘ఓట్లు అవతోలిడికి వేసి పని చేయమంటే ఇవతలి ఎమ్మెల్యే చేస్తడా..చేయగలుగుతడా?”అని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితె వస్తయా? కత్తి వేరేవాడికి ఇచ్చి యుద్ధం చేయమంటే చేస్తడా? అట్లనే పోయినసారి వలిగొండలో ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి ఓట్లు మైనస్​ అయినయి. ఓట్లు అవతలోడికి వేసి.. పని చేయమంటే ఎమ్మెల్యే చేస్తడా.? చేయగలుగుతడా? పథకాలు కావాలనుకుంటే వాటిని అమలు చేసేవాళ్లను గెలిపించుకోవాలి”అని కేటీఆర్​ అన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో నిర్వహించిన రోడ్​ షోలో ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి గురించి ప్రస్తావించారు. మనిషి మంచోడే కాని మనుషులను గుర్తుపట్టుడే మర్చిపోతడని కామెంట్​ చేశారు. డిసెంబర్ 3న భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలుగా పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీత మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు గెలవగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తమని కేటీఆర్ స్పష్టం చేశారు. 

వీపు పగలగొట్టేవారు లేకనా?

ఆ యువకుల వైపు చేయి చూపిస్తూ ‘‘ఆ సన్నాసులు అడుగుతున్నారు.. డిగ్రీ కళాశాల ఎక్కడని? 55 ఏండు పాలించిన కాంగ్రెస్ చెత్తనా కొడుకులను అడగండి. అడగడానికి ఇజ్జత్,​ మానం లేదు. 55 ఏండ్లు పాలించిన చెత్తనాకొడుకులు ఇక్కడికి వచ్చి ఇది లేకపాయె, అది లేకపాయె అని అంటున్నరు. వీపు పగలకొట్టేవారు లేకనా? ఈ 55 ఏండ్లలో యాదాద్రిని జిల్లా చేయాలన్న ఆలోచన రాలేదీ కొడుకులకు. కరెంట్​ ఇచ్చిండ్రా? సాగు, తాగు నీరు ఇచ్చిండ్రా? డిగ్రీ కాలేజీ.. కేసీఆర్​ కిట్​ ఇచ్చిండ్రా?  ఈ కొడుకులు”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులు బిల్డింగ్​ పైకి ఎక్కి యువకులను వెతుకుతుండటంతో వారు పారిపోయారు. అలా వెతుకుతున్న పోలీసుల వైపు చూసిన కేటీఆర్..​ ఏడబోయిండ్రు వాళ్లు. పారిపోయిండ్రా? ఇగో ఇట్లనే ఎవడన్న అడిగితే వలిగొండలో వీపు పగలకొట్టి గుంజేయాలె.. అర్థమైందా? 30 తారీఖు నాడు ఎవ్వడు అడ్డమొచ్చినా.. తొక్కుకుంటా పోవుడే. శేఖర్​రెడ్డిని గెలిపించుడే. ఈ తెగుతవతోనే.. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలె”అని కేటీఆర్​ క్యాడర్​కు పిలుపునిచ్చారు.

బీజేపీ లీడర్లంతా బేకార్​గాళ్లు

పెట్రో ఉత్పత్తుల రేట్లు పెంచడంతో ప్రధాని నరేంద్ర మోదీని ‘‘పిరమైన ప్రధాని”అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ లీడర్లందరూ బేకార్​గాళ్లని, కాంగ్రెస్​ లీడర్​ రాహుల్ గాంధీకి ఎవుసం తెల్వదని, క్లబ్బులు.. పబ్బులు మాత్రమే తెలుసని కామెంట్ చేశారు. 3 గంటలే కరెంట్​ చాలని రేవంత్​ అంటుంటే.. రైతుబంధు వేస్టని  ఉత్తమ్​కుమార్​ రెడ్డి అంటున్నారని విమర్శించారు. కరెంట్​ ఎక్కడుందంటున్న ఈ కాంగ్రెస్​ లీడర్లకు తీగలు పట్టుకుంటే తెలుస్తుందని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుందని అన్నారు. ఇప్పటికి 11 సార్లు అవకాశమిచ్చినా ఏం చేయని ఈ కాంగ్రెస్​, ఇప్పుడు ఒక్క అవకాశమని అంటోందని విమర్శించారు. కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ఎన్నికల తర్వాత అమలు చేయబోయే పథకాల గురించి కేటీఆర్ వివరించారు.