
- అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనేపనికిమాలిన అంశం ఎత్తుకున్నరు
- సీఎం రమేశ్ కామెంట్లపై కేటీఆర్ స్పందన
- తెలంగాణలోనే దేశంలో ఎక్కడా లేని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయాలు
- హెచ్సీయూలో రూ.10 వేల కోట్ల కుంభకోణం
- ఫ్యూచర్ సిటీ రోడ్డంటూ రూ.1,660 కోట్ల స్కామ్
- ఈ రెండింటిపై సీఎం రమేశ్, ముఖ్యమంత్రి రేవంత్ కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధమని సవాల్
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాం గ్రెస్, బీజేపీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం రమేశ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. సీఎం రేవంత్రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచ్చిందని ఆరోపించారు. అందుకు ప్రతిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టును కట్టబెట్టిందని అన్నారు.
ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తానంటూ కేటీఆర్ చెప్పారన్న సీఎం రమేశ్ కామెంట్లపై.. శనివారం ఎక్స్లో కేటీఆర్ రిప్లై ఇచ్చారు. రేవంత్రెడ్డి, సీఎం రమేశ్ బాగోతాన్ని తాను బయటపెట్టడంతో.. ఆ ఇద్దరూ కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారని అన్నారు. తాను ఆనాడు చెప్పింది.. ఈనాడు రుజువు అయిం దని, వారి దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్ కోసం పనికిరాని కథలు చెబుతున్నారని విమర్శించారు.
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డంట
హెచ్సీయూ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు. ‘లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డంట.. దానికి రూ.1,660 కోట్ల కాంట్రాక్టంట’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను చెప్పింది నిజమని తేలింది. దీంతో అటెన్షన్ డైవర్షన్ కోసం కట్టుకథలు చెబుతున్నారు. రూల్స్ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అనుకున్న వాళ్లకు అడ్డంగా కట్టబెట్టడం నీ (సీఎం రమేశ్) దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నీ దోస్తు రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నరు.
తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ.. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతిసారీ.. కాంగ్రెస్, బీజేపీ ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాయి. హెచ్సీయూ భూముల రూ.10 వేల కోట్ల కుంభకోణం, ఫ్యూచర్ సిటీలో రూ.1,660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణాలపై చర్చకు నేను సిద్ధం. సీఎం రమేశ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే ఆ రెండు అంశాలపై చర్చిద్దాం’’ అని పేర్కొన్నారు.