- ఎర్రవల్లి ఫాంహౌస్కు వెళ్తుండగా హకీంపేట వద్ద అడ్డుకున్న పోలీసులు
- కాంగ్రెస్ గూండాలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తున్నరన్న కేటీఆర్
- కేసీఆర్కు ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమైతదని వార్నింగ్
- కార్లు దిగి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్యేలు
- బోయిన్పల్లి పీఎస్కు కేటీఆర్.. జవహర్నగర్ పీఎస్కు హరీశ్ తరలింపు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డిపై మరోసారి నోరు పారేసుకున్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఆయన.. మంగళవారం కూడా అలాగే వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద చావుడప్పు కొట్టేందుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి ఫాంహౌస్కు కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి బయల్దేరి వెళ్లారు.
బీఆర్ఎస్ నేతల వాహనాలు హకీంపేటకు చేరుకోగానే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్వాగ్వాదానికి దిగారు. ‘మా ఇంటికి మేం పోతుంటే ఎందుకు ఆపుతున్నరు. కాంగ్రెస్ గూండాలను ఎందుకు ఆపడం లేదు? వాళ్లకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి తీస్కపోతున్నరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ గూండాలను, నగర బహిష్కరణ చేసిన రౌడీలను పోలీసులు దగ్గరుండి కేసీఆర్ ఫాంహౌస్ మీదికి పంపుతున్నారని మండిపడ్డారు. తాను తన ఇంటికి వెళ్తుంటే అడ్డుకోవడానికి పోలీసులెవరని ఫైర్అయ్యారు.
పోలీసులే దగ్గరుండి కేసీఆర్పై దాడికి దారి చూపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందంటూ హెచ్చరించారు. లక్షల మంది రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతల సమస్యగా మారకముందే పోలీసులు ప్రభుత్వానికి వంతపాడడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. తమను ఆపినట్టు కాంగ్రెస్ వాళ్లను ఎందుకు ఆపడం లేదని నిలదీశారు. తమ నాయకుడిని తామే కాపాడుకుంటామని, పోలీసుల మీద నమ్మకం లేదన్నారు.
కార్లు దిగి.. నడుచుకుంటూ వెళ్లి..
శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఎంత చెప్పినా బీఆర్ఎస్ నేతలు వినలేదు. భారీ కాన్వాయ్లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బారికేడ్లు పెట్టారు. కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలంతా కార్లు దిగి నడుచుకుంటూ ఫాంహౌస్కు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసుల వాళ్లను అనుమతించకపోవడంతో.. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
హరీశ్ రావును జవహర్నగర్ పోలీస్స్టేషన్కు, కేటీఆర్ను బోయినపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో ఆ రెండు పోలీస్ స్టేషన్ల వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్స్టేషన్ల ముందు బైఠాయించి నిరసనలు చేపట్టారు. వారికిపోటీగా కాంగ్రెస్ శ్రేణులు కూడా రెండు పోలీస్ స్టేషన్ల వద్దకు భారీగా చేరుకున్నారు. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు పోలీస్స్టేషన్ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
