బిల్డింగ్స్​ నిర్మాణాలకు 21 రోజుల్లోనే పర్మిషన్​

బిల్డింగ్స్​ నిర్మాణాలకు 21 రోజుల్లోనే పర్మిషన్​
  •     75 గజాల లోపు స్థలాల్లో  నిర్మాణాలకు అనుమతి అవసరం లేదు
  •     సర్కారు స్థలాల్లో ఇతర నిర్మాణాలుంటే.. నోటీసు ఇవ్వకుండానే కూల్చుతం: కేటీఆర్
  •     టీఎస్​బీపాస్  బిల్లుకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: భవన నిర్మాణ అనుమతుల కోసం అప్లై చేసుకున్న 21 రోజుల్లోనే టీఎస్  బీపాస్​చట్టం ద్వారా  అనుమతి ఇవ్వనున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. లేదంటే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ గా భావించాల్సి ఉంటుందన్నారు. ఏదైనా షార్ట్​ ఫాల్ ఉంటే పది రోజుల్లోనే అప్లికేషన్ రిజెక్ట్  చేయనున్నట్టు చెప్పారు. 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఏ విధమైన అనుమతులు అవసరం లేదన్నారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ స్టేట్​ బిల్డింగ్​ పర్మిషన్​, అప్రూవల్​ అండ్​ సెల్ఫ్​ సర్టిఫికేషన్​ సిస్టమ్​ (టీఎస్ బీపాస్)  బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. కేటీఆర్​ మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులను ఈజీ చేసేందుకు, ట్రాన్స్​పరెన్సీ కోసం టీఎస్​బీపాస్ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ బిల్లుతో 95 శాతం పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ విధానంలో నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సిందేనని, లేకుంటే 22 వ రోజున సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్  సంతకంతో కూడిన అనుమతి సర్టిఫికెట్ జారీచేస్తారని పేర్కొన్నారు. దీనిద్వారా బ్యాంకుల్లో లోన్లు పొందవచ్చని, ఈ సర్టిఫికెట్​తో భవన నిర్మాణ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తారని చెప్పారు. టీఎస్​ బీపాస్​ చట్టం అమలు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, జీహెచ్​ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సర్కారు స్థలాల్లో ఇతర నిర్మాణాలుంటే, నోటీసు ఇవ్వకుండానే కూల్చుతామని మంత్రి కేటీఆర్​ హెచ్చరించారు. టీఎస్​ బీపాస్​కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్​ కోర్టు యాక్ట్​ సవరణ బిల్లును ఇంద్రకరణ్​రెడ్డి ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది.