- 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి అవసరం లేదు
- సర్కారు స్థలాల్లో ఇతర నిర్మాణాలుంటే.. నోటీసు ఇవ్వకుండానే కూల్చుతం: కేటీఆర్
- టీఎస్బీపాస్ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్, వెలుగు: భవన నిర్మాణ అనుమతుల కోసం అప్లై చేసుకున్న 21 రోజుల్లోనే టీఎస్ బీపాస్చట్టం ద్వారా అనుమతి ఇవ్వనున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. లేదంటే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ గా భావించాల్సి ఉంటుందన్నారు. ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే పది రోజుల్లోనే అప్లికేషన్ రిజెక్ట్ చేయనున్నట్టు చెప్పారు. 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఏ విధమైన అనుమతులు అవసరం లేదన్నారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్, అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ బీపాస్) బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. కేటీఆర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులను ఈజీ చేసేందుకు, ట్రాన్స్పరెన్సీ కోసం టీఎస్బీపాస్ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ బిల్లుతో 95 శాతం పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ విధానంలో నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సిందేనని, లేకుంటే 22 వ రోజున సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సంతకంతో కూడిన అనుమతి సర్టిఫికెట్ జారీచేస్తారని పేర్కొన్నారు. దీనిద్వారా బ్యాంకుల్లో లోన్లు పొందవచ్చని, ఈ సర్టిఫికెట్తో భవన నిర్మాణ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తారని చెప్పారు. టీఎస్ బీపాస్ చట్టం అమలు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సర్కారు స్థలాల్లో ఇతర నిర్మాణాలుంటే, నోటీసు ఇవ్వకుండానే కూల్చుతామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. టీఎస్ బీపాస్కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్ కోర్టు యాక్ట్ సవరణ బిల్లును ఇంద్రకరణ్రెడ్డి ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది.