పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి.. మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారు: కేటీఆర్

పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి.. మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారు: కేటీఆర్
  • శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయ హస్తం హామీలు
  • కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్నినాళ్లు చూడాలని ప్రజలు బాధపడుతున్నరు
  • ఢిల్లీ పార్టీలను నమ్మితే అరచేతిలో వైకుంఠం చూపించాయి
  • రేవంత్ మాటల మనిషే కాదు.. ఢిల్లీకి మూటలు మోసే మనిషి
  • తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండానే ధైర్యమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్ జెండాపై గెలిచిన పది మంది సన్నాసులు పార్టీ విడిచి వెళ్లిపోయారని, వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఆవేశంతో చెప్తున్న మాట కాదని, బాధతో చెప్తున్నానని పేర్కొన్నారు.  సోమవారం గద్వాల నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తే గద్వాల్​లో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామన్నారు.

“ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తం. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్క బోర్ల పడ్డారు. ఎన్ని రోజులు చూడాలి  కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే విధానాలుగా మార్చుకుని బీఆర్ఎస్ పదేండ్లపాటు ఓ మహాయజ్ఞంలా పనిచేస్తే, రేవంత్ రెడ్డి గత 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై  పనికిరాని నిందలు.. బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు పంపడమే విధానంగా పెట్టుకున్నారు. రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది” అని కేటీఆర్​ విమర్శించారు. 

ఒకసారి రాము.. ఒక్కోసారి రెమో
రేవంత్ రెడ్డి ఒకసారి రాము , ఇంకోసారి రెమోలా మారిపోతారని కేటీఆర్ అన్నారు. సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే.. మిగదంతా సేమ్ టు సేమ్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి.. ఎక్కడైనా నన్ను కోసుకొని తినండి అని మాట్లాడుతారా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఉత్త మాటల మనిషి మాత్రమే కాదని ఆయన ఢిల్లీకి మూటలు మోసే మనిషిగా మారిపోయారని  ధ్వజమెత్తారు. ఒకప్పుడు చంద్రబాబు కోసం మూటలు మోసి అడ్డంగా దొరికిపోయారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఎవరిని బెదిరించాలి, ఎవరిని దోచుకోవాలి, ఎట్లా ఢిల్లీకి దోచుకున్న సొమ్ము పంపాలనే ఆలోచన తప్ప, తెలంగాణపై పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా ? అని ప్రశ్నించారు.

అర చేతిలో వైకుంఠం చూపించారు
ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ బడా నేతలు ఝూటామాటలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి వంచించారని కేటీఆర్ విమర్శించారు. 55 ఏండ్ల పాటు దేశాన్ని పాలించే అవకాశం ఇస్తే కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిన చేతకాని పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే నిండా మోసపోతామని, తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండా మాత్రమే గుండె ధైర్యమనే విషయం నాలుగు కోట్ల ప్రజలకు తెలుసని కేటీఆర్ చెప్పారు. జూన్ లో పార్టీ మెంబర్​ షిప్​ డ్రైవ్ మొదలవుతుందని కేటీఆర్ వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుని ముందుకు సాగుదామని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినా.. ఉప ఎన్నికలు వచ్చినా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.