
- కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్ డీఎస్ఏ) బృందాన్ని పంపించిన కేంద్ర ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ఎందుకు అలాగే స్పందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఘటన జరిగి 200 రోజులు దాటిందని, ఇప్పటికీ 6 మృతదేహాలను వెలికి తీయలేదని ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్ని ఎప్పుడూ కాపాడుతున్నారు? ఇది ఎలాంటి అపవిత్ర బంధం?” అని ప్రశ్నించారు.
‘‘బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ 6 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్ బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు సమాధానాలు రాబడతాం. ఇది బీఆర్ఎస్ వాగ్దానం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.