కేటీఆర్.. మేడిగడ్డ టూర్​కు మీ నాన్నను తీస్కరా

కేటీఆర్.. మేడిగడ్డ టూర్​కు మీ నాన్నను తీస్కరా
  •      త్యాగాలేమో రైతులవి, బాగుపడ్డది మాత్రం కేసీఆర్ కుటుంబం
  •     రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చలో మేడిగడ్డ టూర్ ను స్వాగతిస్తున్నమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాళేశ్వరం శివుడి దగ్గర బీఆర్ఎస్ నేతలు తమ తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలని, ఆపై మేడిగడ్డ దగ్గర  గుండు కొట్టించుకుని నీళ్లలో మునిగి పునీతులు కావాలని ఆయన సైటైర్ వేశారు. బుధవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘కేటీఆర్..  మీనాన్న ను మేడిగడ్డ టూర్ కు తీస్కరా.  మీ అవినీతి బయటపడ్తదనే చలో మేడిగడ్డ ప్రోగ్రామ్ పెట్టారు. మేడిగడ్డకు ఏం పీకనీకి పోతున్నరని కేసీఆర్ మమ్మల్ని విమర్శించిండుగదా. ఇప్పుడు మీరు కూడా అందుకే పోతున్నరా?”అని మకాన్ సింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం భూములు ఇచ్చి  రైతులు త్యాగం చేస్తే, ఫలితాలు మాత్రం కేసీఆర్ కుటుంబం పొందుతోందని మండిపడ్డారు. 

ప్రగతి భవన్ కు వచ్చిన గద్దర్​ను గంటల తరబడి వెయిట్ చేయించి అవమానించినోళ్లు ఇప్పుడు తెలంగాణ కవుల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేకే మా పై బురద జల్లే పనుల బీఆర్ ఎస్ నేతలు పెట్టుకున్నారని విమర్శించారు.