- రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: కాజీపేటలో వెంటనే కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్డిమాండ్ చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ, దక్షిణప్రాంత కార్యకలాపాలతో సికింద్రాబాద్ డివిజన్పై పనిభారం పెరిగిందని తెలిపారు. ఈ మేరకు బుధవారం కేటీఆర్ రాసిన లేఖను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు బీఆర్ఎస్ పార్టీ నేతలు అందజేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, రాబోయే కాలంలో వాడి–రాయచూర్ , విష్ణుపురం–బీబీనగర్ డబ్లింగ్పూర్తయితే ఆ పరిధి సుమారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని అన్నారు.
ఇది రైల్వే ప్రమాణాల ప్రకారం రైల్వే డివిజన్కు ఉండాల్సిన పరిమితి కన్నా చాలా ఎక్కువని చెప్పారు. విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉందని గుర్తుచేశారు.
