
- ఆకస్మికంగా హాస్పిటల్ తనిఖీ
- వచ్చినోళ్లు కనీసం రెండేండ్లైనా పనిచేయకుంటే ఎట్ల?
- గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయడం లేదా?
- డాక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సర్కారు హాస్పిటళ్లలోని కొందరు డాక్టర్ల తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చదువుకుని డాక్టర్లు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరిపై ఎంతో ఖర్చుపెడుతోందని, ఎంతో చేస్తోందని, అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో పనిచేయడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కొందరు స్పెషలిస్టులు కొన్ని ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో పోస్టింగులు తీసుకుని, తర్వాత పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, ఓ రెండేండ్లు పనిచేస్తే తప్పేమిటని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్టులు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం ఉదయం హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత డాక్టర్లు, అధికారులతో సమీక్షించారు. హాస్పిటల్పై వస్తున్న ఫిర్యాదులకు కారణాలు, డాక్టర్లు, గైనకాలజిస్టులు, సిబ్బంది కొరత అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో ఎందుకు ఉండట్లేదు?
సిరిసిల్ల దవాఖానాలో గైనకాలజిస్టులు లేరని రోజూ తనకు సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. సర్కారు హాస్పిటళ్ల పట్ల విశ్వాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్టులు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘సిరిసిల్ల ఏమైనా గిరిజన ప్రాంతమా, జిల్లా కేంద్రంలో పనిచేయడానికి డాక్టర్లు ఎందుకు ఇష్టపడటం లేదు. కొందరు డాక్టర్ల తీరు బాగోలేదు. ఇష్టం లేకుంటే పోస్టింగ్లు తీసుకోవద్దు. వారు రాకుంటే ఎవరో ఒకరు వస్తారు. పోస్టింగ్ తీసుకుని వెళ్లిపోతే.. డాక్టర్లు లేక జనం ఇబ్బంది పడతారు. అంతా కరీంనగర్ పోతం, హైదరాబాద్ పోతం అంటే ఎట్లా? ఆదిలాబాద్ వంటి చోట్ల డాక్టర్లు పనిచేయడం లేదా? ప్రభుత్వం మీ డాక్టర్ చదువు కోసం ఎంత ఖర్చు పెడుతోంది, ఎంత చేస్తోంది. రెండేండ్లు పనిచేస్తే ఏమైతది. అంతా పట్నాలకు పోతమంటున్నరు. ఏదైనా అంటే.. అట్లెట్ల చేస్తరు, ఇట్లెట్ల చేస్తరు అనుకుంట రాష్ట్రమంతా లొల్లి పెడ్తరు. ఇప్పుడింక యూనియన్లు పెట్టుకుంటున్నరు..”అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో పేద ప్రజలు ఉంటారని, గర్భిణులను ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తే ఎలాగని ప్రశ్నించారు. డాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫోన్ చేసి.. సిరిసిల్ల హాస్పిటల్కు నలుగురు గైనకాలజిస్టులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా రెండేండ్లైనా పనిచేయాలని చెప్పాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలని సూచించారు. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో త్వరలో సీటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హాస్పిటల్కు కావాల్సిన మౌలిక వసతులు, సిబ్బంది, ఇతర సమస్యలను తన దృష్టికి తేవాలని సూచించారు.