
ఉప్పల్, వెలుగు: అల్లాటప్పా నాయకులు హైదరాబాద్ను అభివృద్ధి చేయలేరని, సీఎంకేసీఆర్తోనే అది సాధ్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉప్పల్ సెగ్మెంట్ పరిధిలోని మల్లాపూర్, ఈసీఐఎల్లో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. శాంతిభద్రతలను మెయింటెన్ చేయడమనేది కేసీఆర్తోనే సాధ్యమన్నారు.
వచ్చే టర్మ్లో ఉప్పల్లో మూడు ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు. మూసీ బ్యూటిఫికేషన్తో పాటు హబ్సిగూడలో ఇండ్లలోకి వాన నీరు రాకుండా రూ.20వేల కోట్లతో డ్రైనేజీ సిస్టమ్ను ఆధునీకరిస్తామన్నారు. మెట్రోను ఉప్పల్ నలుమూలల కాప్రా, మల్లాపూర్ దాకా విస్తరించి అందుబాటులోకి తెస్తామన్నారు. పేదవాళ్లకు అన్నపూర్ణ, సౌభాగ్య లక్ష్మి, సన్నబియ్యం ఇచ్చే పథకాలు అమలు చేస్తామన్నారు. ఈసారి కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని గెలిపించాలన్నారు. రోడ్ షోలో బండారి లక్ష్మారెడ్డితోపాటు రాగిడి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.