
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
- కూకట్ పల్లి నల్లచెరువు సందర్శన
- ఆక్రమణలు తొలగించడంతో 12 ఎకరాల విస్తీర్ణం పెరిగిందని వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడటమే కాకుండా దాని విస్తీర్ణాన్ని రెట్టింపు చేశామని, అంతేగాకుండా కాలనీల్లో ముంపు సమస్యను పరిష్కరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. గురువారం ఆయన కూకట్పల్లి నల్లచెరువును సందర్శించి, అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆక్రమణలను తొలగించి, 4 మీటర్ల లోతు మట్టిని, పేరుకుపోయిన పూడికను, నిర్మాణ వ్యర్థాలను హైడ్రా తొలగించిందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో 16 షెడ్డులను తొలగించామన్నారు. ఇంతకుముందు చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు ఉండగా ఇప్పుడు 28 ఎకరాలకు పెరిగిందన్నారు.
పిక్నిక్ స్పాట్లా చెరువు..
చెరువు చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్వే నిర్మించామని, రోజూ 600 మంది ఉపయోగిస్తున్నారని, ఆదివారాల్లో చెరువు పరిసరాలు పిక్నిక్ స్పాట్లా మారుతున్నాయని రంగనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. చెరువులో ఐల్యాండ్స్ నిర్మించామని, బోటింగ్ సౌకర్యం, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.