‘కుకూర్ తిహార్’ ఈ పండుగ మనుషులకు కాదు.. కుక్కలకు స్పెషల్. ఐదు రోజులపాటు చేసే ఈ పండుగలో రెండో రోజు కుక్కలకు ప్రత్యేకం. ఏటా అక్టోబర్లో జరిగే ఈ పండుగ సంప్రదాయం నేపాల్లో పుట్టింది. ఎందుకంటే.. కొన్ని లెక్కల ప్రకారం, నేపాల్ రాజధాని ఖాట్మండు లోయలో 20 వేల వీధి కుక్కలు ఉన్నాయట. వాటిలో చాలా కుక్కలు తిండి దొరక్క, యాక్సిడెంట్స్ వల్ల చనిపోయాయి. కొన్ని వ్యాధులతో బాధపడుతున్నాయి. కాబట్టి, వాటికి సాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం డాగ్ వెల్ఫేర్ వాళ్లు కష్టపడుతున్నారు. ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ, ఇది ఒక్కరోజు సమస్య కాదు. అందుకని ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు నేపాలీలు. వీధి కుక్కలు నోరు తెరిచి ఎవరినీ సాయం అడగలేవు. కాబట్టి, ఆ మూగ జీవుల బాగోగులు చూసుకోవాలి. వాటి సంరక్షణకు సపోర్ట్ చేయాలి. కుక్కల మీద ప్రేమ చూపించాలి. వీధి కుక్కల్ని కూడా పెంపుడు వాటిలానే చూడాలి. వాటికోసం ఒక రోజును కేటాయించి, ఏటా ఆ రోజున వాటిని గౌరవించాలి అనుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడు ఈ సంబురాలు చేసుకుంటున్నారు. ఆ రోజున వీధి కుక్కలకు నుదుటన కుంకుమ బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేస్తారు.
అంతేకాదు.. ఈ సారి నేపాలీ పోలీస్లు కూడా ఈ పండుగలో పాలుపంచుకున్నారు. ‘పప్పీ’ అనే పోలీస్ కుక్కను ‘డాగ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించారు. దాని మెడలో మెడల్ వేసి సత్కరించారు. పోలీస్ కుక్కలకి కూడా దండ వేసి, వాటితో కలిసి ఫొటోలు దిగారు.