మావోయిస్ట్‌ల కోసం హెలికాప్టర్​తో కూంబింగ్​

మావోయిస్ట్‌ల కోసం హెలికాప్టర్​తో కూంబింగ్​

పోలీస్​ వర్సెస్ ​మావోయిస్ట్

చత్తీస్ గడ్–తెలంగాణ సరిహద్దులో టెన్షన్​

అడవిలో హెలికాప్టర్​తో పోలీసుల కూంబింగ్​

చత్తీస్​గడ్​లోకి ప్రజలెవరూ వెళ్లవద్దంటూ హెచ్చరిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చత్తీస్​గడ్​– తెలంగాణ సరిహద్దు అడవిలో పరిస్థితులు అక్కడి ప్రజల్లో టెన్షన్​కలిగిస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఓవైపు  పోలీసుల కూంబింగ్..​ మరోవైపు మావోయిస్టుల కదలికలతో అడవి దద్దరిల్లుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా నుంచి చత్తీస్​గడ్​లోకి ఎవరూ వెళ్లవెద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జయశంకర్​భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, చత్తీస్​గడ్​అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున గ్రేహౌండ్స్​బలగాలు మోహరించాయి. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా–చత్తీస్​గడ్​సరిహద్దు అటవీ ప్రాంతంలో హెలికాప్టర్​తో పోలీస్​బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఇటీవల జయశంకర్​భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్​అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాల అధికారులు, తెలుగు రాష్ట్రాలు, చత్తీస్​గడ్ రాష్ట్రానికి చెందిన పోలీస్​బాస్​లు స్పెషల్​ మీటింగ్​ పెట్టారు. మావోయిస్టుల కదలికలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఇదే క్రమంలో మావోయిస్టులు 25 మందికి పైగా ఇన్​ఫార్మర్ల పేర హత్య చేసి పోలీసులకు సవాల్​ విసిరారు. ఓవైపు పోలీస్​ఎన్​కౌంటర్లలో మావోయిస్టుల, మరోవైపు పోలీస్​ఇన్ ఫార్మర్ల పేర మావోయిస్టుల హత్యలతో సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం అట్టుడుకుతోంది. నెల రోజుల వ్యవధిలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు ఎన్​కౌంటర్లో హతమార్చారు. మూడు రోజుల కిందట పోలీస్​ ఇన్​ఫార్మర్​పేర ములుగు జిల్లాకు చెందిన ఈశ్వర్​ను మావోయిస్టులు హత్య చేశారు. అంతకు ముందు టీఆర్ఎస్​ నేతలను హత్య చేశారు. దీంతో పోలీసులు మావోయిస్టులపై ముప్పేట దాడికి ప్లాన్​ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం, జయశంకర్​భూపాలపల్లి, చత్తీస్​గడ్​అటవీ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముడుతున్నారు. చర్ల, తిప్పాపురం, చెన్నాపురం, పామేడు, ఎర్రంపాడు, పుట్టపాడు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్​ బలగాలు కూంబింగ్​ను మంగళవారం నుంచి ముమ్మరం చేశాయి. భద్రాచలం నుంచి చత్తీస్​గడ్​ వెళ్లే రహదారులను అనధికారికంగా మూసేశారు. పోలీస్​ ఫైరింగ్​లో మావోయిస్టులు గాయపడితే వారికి చికిత్స చేసేందుకు జిల్లా నుంచి ఆర్ఎంపీలు వెళ్లే అవకాశం ఉండటంతో సరిహద్దు అటవీ ప్రాంతంలో నిఘా పెట్టారు.

మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు
నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చత్తీస్ గడ్ రాష్ట్రంలోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతమంతా పోలీస్ బలగాల పహారాలో ఉందన్నారు. పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతున్న క్రమంలో పట్టు బడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని భద్రాచలం, చర్ల, దుమ్ము గూడెం పరిసర ప్రాంతాల్లో పోలీస్ నిఘా ఉందన్నారు. ఆర్ఎంపీలు, వ్యాపారులు మావోయిస్టులకు సహకరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

For More News..

పేర్లేమో పేదలవి.. బిల్డింగ్​లేమో లీడర్లవి

కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ల హెచ్చరికతో దీక్ష విరమించిన సంజయ్

స్మార్ట్ ఫోన్ వాడకంతో నష్టాలెంటో తెలిస్తే.. మళ్లీ ఫోన్ ముట్టరు

చంద్రునిపై మస్తు నీళ్లు.. తేల్చిన నాసా..