కర్నూలు జిల్లా గూడూరు మండలం తాహశీల్దార్ షేక్ హసీనా ఏసీబీ వలకు చిక్కింది. మధ్యవర్తి ద్వారా ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకొని ఆ తర్వాత మొబైల్ స్విచ్చాఫ్ చేసి పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు తహశీల్దార్ కార్యాలయంలో MRO గా పనిచేస్తున్న షేక్ హాసీనా సురేశ్ అనే రైతు దగ్గర ఓ వివాదాస్పద భూమి పరిష్కారం విషయంలో MRO రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.4 లక్షల వద్ద బేరం కుదుర్చుకొని తన మధ్యవర్తికి ఆ మొత్తాన్ని ఇమ్మని చెప్పారు.
అందుకు సరేనన్న సురేశ్ గురువారం సాయంత్రం 4 గంటలకు MRO కార్యాలయానికి రాగా పాణ్యం బస్టాండు వద్ద తన మధ్యవర్తి (మహబూబ్ బాషా) ఉంటాడని, ఆ లంచం (రూ.4 లక్షలు) అతనికి ఇవ్వాల్సిందిగా తాహశీల్దార్ సూచించారు. రాత్రి 7 గంటల సమయంలో పాణ్యం బస్టాపుకు వెళ్లిన సురేశ్ ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా ఆ మధ్యవర్తిని కలుసుకొని, అతనికి డబ్బు ఇచ్చాడు. సురేశ్ ఫిర్యాదు మేరకు ఇదంతా ముందు నుంచే గమనిస్తున్న ఏసీబీ అధికారులు ఆ బస్టాండ్ ఆవరణలో అతన్ని(మహబూబ్ బాషా) మాటువేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
డబ్బు ముట్టిన తర్వాత తన మధ్యవర్తి నుండి సరైన సమాచారం లేకపోవడంతో.. ఏదో తేడా జరిగిఉంటుందని గ్రహించిన తాహశీల్దార్ ఫోన్ స్విచాఫ్ చేసి పరారయ్యారు. ఫోన్ స్విచాఫ్ రావడంతో ఏసీబీ.. గాలింపు బృందాలను రంగంలోకి దింపింది.
అవివాహితురాలైన షేక్ హసీనా..దివ్యాంగురాలు. గ్రూప్స్ రాసి నేరుగా డిప్యూటీ తాహశీల్దార్ ఉద్యోగం సంపాదించి, కర్నూలు నగరంలోని సి.క్యాంపులో ఉన్న ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అక్కడి నుంచి గూడూరుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.
MRO ఆచూకీ కోసం అధికారులు ఆ మధ్యవర్తిని వెంటపెట్టుకుని ఉమెన్స్ హాస్టళ్లన్నీ గాలించినా ఆమె కనిపించలేదు. దీంతో హసీనా మీద కేసు నమోదు చేసి, ఆ మధ్యవర్తిని కోర్టులో హాజరుపరచారు ఏసీబీ అధికారులు.