బెల్లంపల్లి ఎమ్మెల్యేకు నిరసన సెగ

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు నిరసన సెగ
  • కుశ్నపల్లిలో దుర్గం చిన్నయ్యను అడ్డుకున్న గ్రామస్తులు
  • పోడు పట్టాలు ఇవ్వలేదని, అభివృద్ధి చేయలేదని నిరసన 

బెల్లంపల్లి రూరల్, వెలుగు : బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. సోమవారం ప్రచారంలో భాగం గా నెన్నెల మండలం కుశ్నపల్లికి వెళ్లగా ఆయన కాన్వాయిని గ్రామస్తులు పొలిమేరల్లో అడ్డుకున్నారు. పోడు భూములకు పట్టాలివ్వలేదని, ఊరిని అభివృద్ధి చేయలేదంటూ నిలదీశారు.

 ఊరి గురించి పట్టించుకోనప్పుడు ఊర్లోకి అడుగు పెట్టవద్దని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో ఎమ్మెల్యేనే కారు దిగి నిరసన వ్యక్తం చేస్తున్న వారిని నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు కూడా గ్రామస్తులను నెట్టివేశారు. తర్వాత అక్కడ ఆలయంలో పూజలు చేసి వెనుదిరిగి వెళ్లిపోయారు.