
కూసుమంచి, వెలుగు : గోవులను వాహనాల్లో అక్రమంగా తరలిస్తుండగా కూసుమంచి పోలీసులు పట్టుకున్నారు. దీనికి కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఖమ్మం–-సూర్యాపేట హైవే ప్లై ఓవర్ పైన మంగళవారం తెల్లవారుజామున ఆగి ఉన్న రెండు మినీ ట్రక్కులను పోలీసులు గమనించి దగ్గరకు వెళ్లి చూశారు. అందులో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలం, రాయిగూడెం గ్రామం నుంచి సూర్యాపేట సంతకు తరలిస్తున్నట్లుగా తేలింది. వెంటనే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెంకు చెందిన ఇద్దరు డ్రైవర్లు ఆవుల క్రిష్ణయ్య, ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.