రిపేర్లకు ఎల్​ అండ్​ టీ ఓకే?

రిపేర్లకు ఎల్​ అండ్​ టీ ఓకే?
  •    మేడిగడ్డ బ్యారేజీ పనులకు సూత్రప్రాయ అంగీకారం
  •     ఓ అండ్ ఎం పరిధిలోని పనుల్నే చేసేందుకు సమ్మతి
  •     డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగియలేదు కనుక సంస్థదే బాధ్యతంటున్న అధికారులు
  •     ఇయ్యాల మేడిగడ్డ బ్యారేజీపై సీఎం రేవంత్ రివ్యూ చేసే చాన్స్

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లపై ఎల్ అండ్ టీ పునరాలోచనలో పడిందా? అంటే అవునన్న సమాధానమే వస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లపై మొదటి నుంచి మొండికేస్తున్న సంస్థ.. ఇప్పుడు ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన రిపేర్లను చేసేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పరిధిలోకి వచ్చే రిపేర్లను మాత్రమే చేసేందుకు సంస్థ ఓకే చెప్పినట్టు తెలిసింది.

 మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీపై ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. వానాకాలం దగ్గరపడుతుండడంతో బ్యారేజీకి చేయాల్సిన రిపేర్లతో పాటు.. మరికొన్ని జియోఫిజికల్ టెస్టులను నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఏడాది వర్షాకాలమంతా మూడు బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచాల్సిందిగా సూచించింది.

మేడిగడ్డ దగ్గర పాడైపోయిన పియర్స్​తో పాటు షీట్​పైల్స్​కు రిపేర్లను సూచించింది. బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్​లోని 20, 21వ నంబర్ గేట్లను పూర్తిగా కట్​చేసి తొలగించాలని, ఆ బ్లాక్​లో జామ్ అయిన మిగతా గేట్లను తెరవాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్​పై ఇరిగేషన్ శాఖ చర్యలను ముమ్మరం చేసింది. రిపేర్లు చేసేందుకు సంస్థ తొలుత ససేమిరా అన్నా.. ఆ తర్వాత అంగీకరించిందని సమాచారం.

సర్కార్ సీరియస్ అవడంతో

ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన పనుల్లో చాలా వరకు ఓ అండ్ ఎం పరిధిలోకి వచ్చే పనులే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్​ కూడా పూర్తి కాలేదు. ఆ సర్టిఫికెట్​నూ నిర్మాణ సంస్థకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఓ అండ్ ఎం పనులను కచ్చితంగా చేసి తీరాల్సిందేనని అధికారులు నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికే నిర్మాణ సంస్థకు లేఖ రాయడంతో పాటు సమావేశం కూడా నిర్వహించినట్టు తెలిసింది.

డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తి కాలేదు కనుక ఆ పనుల బాధ్యత నిర్మాణ సంస్థదేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే, తొలుత దానికయ్యే ఖర్చుకు సంబంధించి కొత్త ఒప్పందం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు చెప్పినట్టు తెలిసింది. అయితే, దీనిపై రాష్ట్ర సర్కారు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థతోనే పనులు చేయించాల్సిందిగా సూచించినట్టు సమాచారం. మరోసారి ఒప్పందం చేసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే సంస్థ.. దానికి సంబంధించిన పనులను చేయించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. అయితే, ప్రస్తుతం బ్యారేజీ వద్ద మరోసారి జియోఫిజికల్ టెస్టులు చేయాల్సి రావడం, రిపేర్లు కూడా చేయాల్సి ఉండడంతో దాని ఖర్చు రూ.300 కోట్ల దాకా అవుతుందని అంచనా వేస్తున్నారు.

రివ్యూ కు నిర్మాణ సంస్థ ప్రతినిధులు?

రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. రేపో ఎల్లుండో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ క్రమంలోనే ఈసారి వానాకాలం జల్దీ షురూ అవుతుందన్న అంచనాలున్నాయి. వర్షాలు బాగా పడుతాయనే సూచనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వానాకాలానికి ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.

శనివారం మేడిగడ్డ బ్యారేజీపై ఆయన రివ్యూ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. రివ్యూకు అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులను కూడా పిలిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వర్షాకాలం ప్రారంభమైతే రిపేర్లు చేయడం కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా పనులను ప్రారంభించేలా చర్యలను చేపట్టనున్నారు.