మళ్లీ సర్వేలు చేయను: లగడపాటి రాజగోపాల్

మళ్లీ సర్వేలు చేయను: లగడపాటి రాజగోపాల్

ఏపీలో వెలువడిన అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఫలితాల్లో తన సర్వే విఫలమైందనే విషయంపై  మీడియాకు ఓ ప్రెస్ నోట్ పంపారు. డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ,  ఏప్రిల్ లో జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని అందులో ప్రకటించారు. ఇందుకు కారణాలు ఏమైనా సరే వరుసగా రెండు సార్లు విఫలమయ్యానని, ఇకపై భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సంచలన ప్రకటన చేశారు.

2014 లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపీ పదవికి రాజీనామా చేశానని, ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నానని తెలిపారు.అప్పటి నుంచి తాను ఏ పార్టీకీ అనుబంధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.

2004 నుంచి సర్వేలు తనకు ఒక వ్యాపకంగా మారాయని, ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా కూడా పక్షపాతం లేకుండా చెప్పానని లగడపాటి అన్నారు. అలాగే ఏపీ, తెలంగాణలో కూడా మీడియా ద్వారా సర్వే వివరాలను ప్రజలకు వివరించానని అన్నారు.

తన ఫలితాల వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించమని కోరారు. ఇక నూతన సీఎంగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్ జగన్‌కు  లగడపాటి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పడాలని ఆయన కోరారు.