లక్ష్మీ కటాక్షమే ధన త్రయోదశి : తాళ్లపల్లి యాదగిరి గౌడ్‌

లక్ష్మీ కటాక్షమే  ధన త్రయోదశి : తాళ్లపల్లి యాదగిరి గౌడ్‌

‘ధనం మూలం మిదం జగత్‌’ అంటారు. డబ్బుతోనే ప్రపంచం నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే. కాసులు లేనివాడు ఎందుకూ కొరగాడు. మానవుని ప్రతి అవసరం తీర్చేది డబ్బే కనుక డబ్బు సంపాదనకు మానవులు ఎన్నో మార్గాలు ఎంచుకున్నారు. కాబట్టి ధనానికి  ప్రతీక అయిన లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమయితే సకల సంపదలు సమకూరుతాయనేది ప్రజల విశ్వాసం. అందుకు లక్ష్మీదేవిని శాస్త్ర యుక్తంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ, నిష్టలతో కొలువడానికి పూర్వం ఋషులు ధన త్రయోదశిని గొప్ప పర్వదినంగా నిర్ణయించి కొనసాగించారు. చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అని పేరుపెట్టి లక్ష్మీమాత ప్రీత్యర్థం వైభవోపేత పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. ధనత్రయోదశి రోజునే లక్ష్మీపూజ ఎందుకు? అంటే లోక హితానికి దేవ, దానవులు. అమృతం, ఇంకా మరెన్నో ప్రయోజనాలు పొందడానికి పాల సముద్రాన్ని చిలికారు. ఈ క్రమంలో ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి రోజున శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది.

శ్రీలక్ష్మి ఉద్భవించిన రోజు

ఆమె ధనకళలతో మహోజ్వల తేజోప్రకాశితయై జన్మించినందున ఆ త్రయోదశికి ధనత్రయోదశి అని ముక్కోటి దేవతలు, ఋషులు పేరు పెట్టారు. అందుకే లక్ష్మీదేవి ప్రభవించిన ఆ దివ్య ధనత్రయోదశికి అంతటి ప్రాశస్త్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే శ్రీమహావిష్ణువుకు దేవేరీ అయింది. కాగా, ఇదే కృష్ణ త్రయోదశి నాడు లక్ష్మీదేవితోపాటు దేవ వైద్యుడు ధన్వంతరి, అలాగే కామధేనువు, కల్పవృక్షం, కాలకూట మహావిషం అనంతరం అమృతం ఇంకా తదితరాలు ఎన్నో ఉద్భవించాయి.

ఐదు రోజుల పండుగ

దీపావళి పండుగ క్రమంలో.. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిని ‘చోటీ దీపావళి’ అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. దీపావళి పండుగ పురస్కరించుకొని ఐదు రోజుల పర్వదినాలుగా జరుపుకుంటున్న క్రమంలో మొదటిదైన ధనత్రయోదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.  దీపావళి రోజున లక్ష్మీదేవి.. తనపై భక్తితో అందంగా ఆకర్షణీయంగా అలంకరించిన ఇంటికి వస్తుందన్న నమ్మకం వుంది. అందుకే దీపావళి రోజున ప్రధానంగా లక్ష్మీపూజ చేస్తారు. ఇంటిలోని వారందరు అభ్యంగన స్నానాలు చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని మంగళకరంగా అలంకరించి, ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను లేదా కొత్తగా కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పూజలు చూస్తారు. ఈ విధంగా భక్తి, శ్రద్ధలతో తనను అరాధించిన భక్తకోటి మనోభీష్టాలను లక్ష్మీదేవి నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం.

కుబేర, ధన్వంతరీలకు పూజలు

లక్ష్మీదేవితో పాటు జన్మించిన అమె సోదర తుల్యుడు దేవ వైద్యుడు, ధన్వంతరీకి, అలాగే ధనానికి అధినాయకుడైన ఉత్తర దిక్పాలకుడు కుబేరునికి కూడా లక్ష్మీదేవితో పాటు ధనత్రయోదశి నాడు పూజలు చేస్తారు. కాగా కుబేరుడి తపోనిష్టకు మెచ్చి శ్రీమహాలక్ష్మి అతనికి అపార ధనరాశినిచ్చి సిరిసంపదలకు అతన్ని శాసకుడిగా చేసింది.

ఉత్తరాదిన ‘ధన్ తేరస్’​గా..

ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గుజరాతీయులు ధనత్రయోదశి రోజును సంవత్సరాది పండుగగా కూడా జరుపుకుంటారు. అలాగే వారు ‘అమాదేరజ్యోతి షీత్రత్రయోదశి’ గా చెబుతారు. గుజరాతీయులు ధనత్రయోదశిని ‘ధన్‌ తేరస్‌’ గా అతి పవిత్రంగా పిలుస్తారు. ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ‘గోత్రిరాత్రి వ్రతం’ జరుపుతారు. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

పితృదేవతలు వస్తారు  

ధనత్రయోదశినాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి దిగి వస్తారని ప్రజల విశ్వాసం. పితృదేవతలకు దారి చూపడానికి దక్షిణం వైపు దీపం పెడతారు. ఇలా దీపారాధన చేసినవారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

అష్టలక్ష్మి అవతారాలు  

మానవున్ని సుఖ, సంతోషాలతో పిల్లాపాపలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో అనంద మయంగా జీవింపజేయడానికి శ్రీలక్ష్మీమాత అష్టలక్ష్ముల అవతారాలను దాల్చింది.  ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి,  విద్యాలక్ష్మి, విజయలక్ష్మిలను ఎనిమిది రూపాల్లో సర్వసంపదలిచ్చే తల్లిగా ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతున్నారన్న విశ్వానం ఉంది.

సంపదలిచ్చే తల్లిగా..

సకల ప్రజలను తన బిడ్డలుగా ఎంచుకొని వారికి నిరంతరాయంగా సర్వ సంపదలిస్తున్న తల్లి లక్ష్మీదేవిని కొలువని వారు లేరు. లక్ష్మీదేవిని మదినిండా నింపుకొని భక్తి, పారవశ్యంతో ఆరాధించి తల్లి అనుగ్రహం పొందిన ఎందరెందరో దరిద్ర నారాయణులు  అప్టైశ్వర్యవంతులయ్యారని పురాణాలు ఎన్నో ఉదంతాలను ఉదహరిస్తున్నాయి.-

లక్ష్మీదేవికి ప్రతిరూపం స్త్రీ

సనాతనంగా సమాజంలో స్త్రీకి సమున్నత గౌరవం, సాధికారత ఎంతో గొప్పగావుంది. ప్రతీ రంగంలో ఆమెను శిఖరాగ్రంపై రారాణిగా అధిష్టింపజేయడానికి పూర్వీకులు ఎన్నో ఏర్పాట్లు చేశారు. స్త్రీకి అలాంటి మహోన్నత గౌరవం దక్కడానికి త్రిశక్తిదేవత (లక్ష్మీ, పార్వతి, సరస్వతి)లతో పోల్చారు. ముఖ్యంగా అడపిల్లల్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఎంతో సంబరంగా గొప్పగా చెబుతారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కావాలని ఆడవాళ్ళకు లక్ష్మి, వరలక్ష్మి, ధనలక్ష్మి ఇలా లక్ష్మిల పేర్లు పెట్టి నిత్యం ధనదేవత లక్ష్మీమాతను తమ మదిలో నిలుపుకుంటారు. -స్త్రీలు సంతోషంగా ఉన్నచోట తానుంటా. స్త్రీలు ఎక్కడ సుఖ సంతోషాలతో చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడుతారో... అక్కడ తానుంటానంది లక్ష్మీదేవి. దీంతో స్త్రీని ప్రతీ ఒక్కరూ మర్యాదగా. గౌరవంగా చూసుకోవాలన్న జ్ఞానోదయం కలుగుతుంది.

- తాళ్లపల్లి యాదగిరిగౌడ్‌,
ఫ్రీలాన్స్​ జర్నలిస్ట్​, ములుగు