మునుగోడు: కోమటిరెడ్డి లక్ష్మీ ముమ్మర ప్రచారం

 మునుగోడు: కోమటిరెడ్డి లక్ష్మీ ముమ్మర ప్రచారం

 యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఆయన సతీమణి లక్ష్మీ  రాజగోపాల్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిష్టాపురం, ఇప్పర్తి, ఉకొండి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్లిన లక్ష్మీ  రాజగోపాల్ రెడ్డికి మహిళలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరుగుతూ.. ఇండ్లలోకి వెళ్తూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.

స్థానిక ప్రజలతో ప్రేమగా కుశల ప్రశ్నలు వేస్తూ..వారి యోగ క్షేమాలు ఆరా తీస్తూ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ మహిళా నేతలతో కలసి లక్ష్మీ  రాజగోపాల్ గడపగడపకూ తిరిగి ప్రచారం చేశారు. పేద ప్రజలను ఆదుకునే మనసున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని  గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని,  ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని లక్ష్మీ  రాజగోపాల్ కోరారు.