
పాట్నా: బీహార్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా మర్డర్ కేసు మిస్టరీ వీడింది. భూ వివాదమే గోపాల్ ఖేమ్కా హత్యకు కారణమని బీహార్ పోలీసులు వెల్లడించారు. అశోక్ సాహ్ అనే బిజినెస్మెన్ హత్య వెనుక ప్రధాన సూత్రధారి అని తెలిపారు. బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మంగళవారం (జూలై 8) గోపాల్ ఖేమ్కా హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
గోపాల్ ఖేమ్కా, తోటి వ్యాపారవేత్త అశోక్ సాహ్ మధ్య చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని చెప్పారు. కోట్ల విలువైన ఓ ల్యాండ్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని.. దీంతో గోపాల్ ఖేమ్కాను అంతం చేయాలని అశోక్ నిర్ణయించుకున్నాడని తెలిపారు. ప్లాన్లో భాగంగా ఖేమ్కాను హత్య చేయడానికి కాంట్రాక్టర్ కిల్లర్ ఉమేష్ యాదవ్కు రూ.4 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ నాలుగు లక్షలు తీసుకుని గోపాల్ ఖేమ్కాను కాల్చి చంపాడు.
►ALSO READ | నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష.. ఎందుకంటే..?
ఎస్టీఎఫ్, పాట్నా పోలీసులు సంయుక్తంగా ఒక బృందంగా ఏర్పడి నేరస్థలం నుండి ఆధారాలు, సీసీటీవి ఫుటేజ్, నిందితులు ఉపయోగించిన బైకును గుర్తించి నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. నేరానికి ఉపయోగించిన బైక్ పట్టుబడటంతో ఈ కేసు కొలిక్కి వచ్చిందన్నారు. కాంట్రాక్ట్ కిల్లర్ ఉమేష్ యాదవ్ను ఆదివారం పాట్నాలో అరెస్టు చేశామని వెల్లడించారు. ఉమేష్తో పాటు ఈ కేసులోని నిందితులందరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. గోపాల్ ఖేమ్కా హత్యకు స్కెచ్ వేసింది మొత్తం అశోక్ సాహ్నేనని తెలిపారు.