ఫేక్​ జీపీఏ సృష్టించి భూ అక్రమాలు

ఫేక్​ జీపీఏ సృష్టించి భూ అక్రమాలు

హనుమకొండ, వెలుగు:  భూ పట్టాదారుల పేరుతో  ఫేక్​ జీపీఏ(జనరల్​ పవర్​ ఆఫ్​ అటార్నీ) సృష్టించి, భూఅక్రమాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.  వారి నుంచి 15 నకిలీ రబ్బర్​ స్టాంప్స్​,  మూడు స్మార్ట్ ఫోన్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్​ స్వాధీనం చేసుకున్నారు.  శనివారం హనుమకొండ ఏసీపీ ఆఫీస్​లో  సెంట్రల్​ జోన్​ డీసీపీ అబ్దుల్​ బారీ  వెల్లడించిన వివరాల ప్రకారం..  వడ్డేపల్లి శివారు సప్తగిరి కాలనీలోని సర్వే నెంబర్ 12లో  నాన్​ లే అవుట్​ వెంచర్​లో  హనుమకొండ  రాంనగర్​కు చెందిన రాపర్తి సురేశ్ తన అన్న  కూతురు  నుంచి 200 గజాలు,  గోపాలపూర్​ సురేంద్రపురి కాలనీకి చెందిన కోమందల సునీల్​ రెడ్డి తన అత్తగారి నుంచి 226 గజాలు కొనుగోలు చేశాడు. 2019 నుంచి ఆ ల్యాండ్​ వారి అధీనంలోనే ఉంది.  కొద్దిరోజుల కింద కొంతమంది దుండగులు ఆ భూమి మీదకొచ్చి తమదేనని దౌర్జన్యానికి దిగారు.

పట్టా దారు పేరుతో ఫేక్​ జీపీఏ

 హనుమకొండ విజయనగర కాలనీకి చెందిన వల కేదారేశ్వరరావు,  వడ్డేపల్లికి చెందిన ఆడెపు సతీశ్​ కుమార్​,  వరంగల్ డాక్టర్స్​ కాలనీకి చెందిన సాజిద్​ పాషా, ముజమ్మల్​ అహ్మద్​ అనే నలుగురు  కలిసి సప్తగిరి కాలనీలోని సురేశ్​, సునీల్​ రెడ్డికి సంబంధించిన భూమిపై కన్నేశారు. ఆ భూమికి పింగలి జయరాంచంద్రారెడ్డి, అతడి కొడుకు కార్తీక్​ రెడ్డి పట్టాదారులని గుర్తించారు.  తమ ప్లాన్​లో భాగంగా  ముజమ్మల్ అహ్మద్​ వరంగల్ కు చెందిన  చీకటి శివ, సురేశ్​ అనే వ్యక్తుల సాయంతో తానే కార్తీక్​ రెడ్డిగా నకిలీ ఆధార్​ కార్డులు తయారు చేయించుకున్నాడు.  అనంతరం వల కేదారేశ్వర్రావుకు ఆ రెండు ప్లాట్లకు రిజిస్ట్రేషన్​ ఆఫీస్​లో జీపీఏ చేశాడు. 

ఆ తర్వాత కేదారేశ్వర్​రావు ఆ స్థలాన్ని హనుమకొండ విజయపాల్​ కాలనీకి చెందిన సాజిద్​ పాషాకు రిజిస్ట్రేషన్​ చేశాడు. ల్యాండ్​ డాక్యుమెంట్స్​ అన్నీ క్లియర్​ కావడంతో అవే నకిలీ పత్రాలతో కరీంనగర్​ బెజ్జంకి మండలానికి చెందిన ఐలోని శ్రీకాంత్​ రెడ్డి సాయంతో లోన్ కూడా తీసుకున్నారు.  ఆ తర్వాత ఆ భూమి తమదేనని, తమకు పట్టాదారులు పింగలి జయరాంచంద్రారెడ్డి, అతడి కొడుకు కార్తీక్​ రెడ్డి జీపీఏ చేశాడని, తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని బాధితులు సురేశ్​, సునీల్​ రెడ్డి భయభ్రాంతులకు గురి చేశారు.  దీంతో బాధితులు కేయూ పోలీస్​ స్టేషన్ లో మూడుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్​ ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితులైన వల కేదారేశ్వర్​, ఆడెపు సతీశ్​, ముజమ్మల్ అహ్మద్​ ను అరెస్ట్​ చేశారు. మిగతా నలుగురు  పరారీలో ఉన్నారు.