మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలోని తాడిచెర్ల జెన్కో ఓపెన్ కాస్ట్ పనులను మంగళవారం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ లో లీజు విధానం ఎందుకని జెన్కో ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
500 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లు, భూములకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ పనులను రెండు చోట్ల అడ్డుకొని ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జెన్కో ఆఫీసర్లు, పోలీసులు నిర్వాసితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. లీజు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కోల్ మైన్ లో ఉద్రిక్తత నెలకొంది.
