గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నను అర్థరాత్రి ప్రత్యే క అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య ఆలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆస్పత్రికి వచ్చిన తర్వాత కుప్పం నుంచి బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. తారకరత్నకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. డాక్టర్ ఉదయ్ నేతృత్వంలోని వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తారకరత్న కూడా పాల్గొన్నారు. నారా లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిన్న బాలకృష్ణ, లోకేష్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.