
చిరంజీవి రీ ఎంట్రీ కేవలం మెగా అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించే ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ సంతోషాన్ని కలిగించింది. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలకు వచ్చిన స్పందనే దానికి ఉదాహరణ. ఇప్పుడు అందరి చూపు ఆయన కొరటాల శివ డైరెక్షన్లో చేసే సినిమా మీదే ఉంది. అందుకే ఆ మూవీ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఆ మధ్య ఈ మూవీకి ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ పెట్టారనే వార్త గుప్పుమంటే.. అది నిజం కాదని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ‘గోవిందా హరి గోవిందా’ అనే పేరు పెట్టారని చెప్పుకుంటున్నారు. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని, ఒకరి పేరు గోవింద్ అనీ మరొకరి పేరు ఆచార్య అని వచ్చిన వార్త నుంచి పుట్టికొచ్చాయీ టైటిల్స్.
మరోపక్క కథ గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. సొసైటీలోని సమస్యలను హైలైట్ చేస్తూ సినిమాలు చేసే కొరటాల శివ.. మెగాస్టార్ కోసం కూడా అలాంటి కథే రెడీ చేసి ఉంటాడని అంచనా. దాంతో ఆ కథ, ఈ కథ అంటూ చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో పని చేసే ఉద్యోగి పాత్ర అనేది అన్నిటికంటే ఎక్కువ ప్రచారంలో ఉంది. సింహాచలం వరాహ నరసింహస్వామి దేవాలయ భూముల్ని కాజేసిన కేసు చుట్టూ కథ తిరుగుతుందట.
గుడి మాన్యాలను కాజేసేవారి భరతం పట్టే వ్యక్తిగా చిరు కనిపిస్తారట. అలాగే హీరోయిన్ల డిస్కషన్ మరొకటి. త్రిష ఫైనల్ అయ్యిందని, సెకెండ్ హీరోయిన్గా ఈషా రెబ్బాను అడిగారని, ఈ సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోందని.. ఇలా ఒకటి కాదు, చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏ విషయమూ అధికారికంగా బైటికొచ్చింది కాదు. అన్నీ ఊహాగానాలే. మెగాస్టార్ సినిమా మీద ఉన్న ఆసక్తి వల్ల పుట్టుకొచ్చినవే. వీటిలో ఏవైనా వాస్తవాలున్నాయా లేక అన్నీ పుకార్లేనా అనేది ఇప్పటికైనా టీమ్ క్లియర్ చేయకపోతే.. ముందు ముందు ఇంకెన్ని గాసిప్స్ వినాల్సి వస్తుందో.