దివ్యాంగులు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందే. దారిలో ఎన్నెన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. కాళ్లు లేనోళ్లు మెట్లు ఎక్కలేరు. అంధులకు ముందేముందో తెలియదు. నరాలు, కండరాలు చచ్చుబడిపోయినోళ్లు అడుగు తీసి అడుగు వేయలేరు. అలాంటి వాళ్లకు చిన్నాచితకా పరిష్కారాలున్నా అవి కొద్ది వరకే పరిమితమవుతున్నాయి. మరి, పూర్తిగా వాళ్లకు అండగా నిలబడే పరిష్కారాల్లేవా? అంటే ఓ మూడు కంపెనీలు ఆయా వర్గాల వారికి టెక్నాలజీతో పరిష్కారం చూపించింది. ఆ కంపెనీలు తయారు చేసిన మూడు పరికరాలు వాళ్లను ముందుకు నడిపించే బాటలు వేశాయి.
మెట్లెక్కించే వీల్చైర్
కాళ్లు లేనోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మెట్లెక్కలేరు. వీల్చైర్ ఉంటే తప్ప ముందుకు సాగలేరు. అలాంటి వాళ్ల కోసం స్విట్జర్లాండ్ కంపెనీ స్కూవో ఓ స్పెషల్ వీల్చైర్ను తయారు చేసింది. స్మార్ట్ఫోన్తో దానిని నియంత్రించేలా టెక్నాలజీ హంగులు అద్దింది. మెట్లు, ఇతర ఎగుడుదిగుడు దారుల్లో సాఫీగా తీసుకుపోయేలా రూపునిచ్చింది. ఆ వీల్చైర్కు రబ్బర్ ట్రాక్లు పెట్టింది. ఆ రబ్బర్ ట్రాక్లే మెట్లెక్కించి దివ్యాంగులను పైకి తీసుకెళతాయి. జోస్ డి ఫెలిస్ అనే దివ్యాంగుడు యూట్యూబ్లో పరిష్కారం కోసం వెతుకుతుండగా స్కూవో వీల్ చైర్ కనిపించింది. వెంటనే కంపెనీతో మాట్లాడాడు. దీంతో అతడిపైనే కంపెనీ తొలిసారి ఆ వీల్చైర్ను టెస్ట్ చేసింది. చాలా సమర్థంగా పనిచేసింది ఆ వీల్చైర్. 2019 చివరి నాటికి వాటిని దివ్యాంగులకు అందించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. మొదటి వీల్చైర్ను ఫెలిస్ అందుకోబోతున్నాడు.