
ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష పర్యటన వాయిదా పడింది. భారత్ కు చెందిన శుభాన్షు శుక్లా,మరో ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ఆక్సియం-4 అంతరిక్ష మిషన్ ప్రయోగం బుధవారం (జూన్ 11) మళ్లీ వాయిదా పడింది. ఈసారి మిషన్ను అమలు చేయడానికి ఉపయోగించే స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో సాంకేతిక సమస్యను తలెత్తడంతో వాయిదా పడింది.
వాస్తవానికి యాక్సియం-4 మిషన్ మే 29న ప్రయోగించబడాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల జూన్ 8కి, ఆపై జూన్ 10కి, మళ్ళీ జూన్ 11కి వాయిదా వేశారు. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ (LOx) లీక్ గుర్తించిన కారణంగా ఐదవసారి కూడా వాయిదా పడింది.
స్పేస్ఎక్స్, నాసా, యాక్సియమ్ స్పేస్ ,ఇస్రో బృందాలు ఈ లీక్ను సరిచేసి ప్రయోగానికి ముందు అవసరమైన టెస్ట్ లు చేసేందుకు సమయం పడుతుందని ప్రకటించాయి. కొత్త ప్రయోగ తేదీని ఇంకా ప్రకటించబడలేదు. జూన్ చివర లేదా జూలైలో ఆక్సియం-4 మిషన్ ప్రయోగించేందుకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని NASAలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రోగ్రామ్ మేనేజర్ డానా వీగెల్ అన్నారు.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లే మొదటి భారతీయ వ్యోమగామి అవుతారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లే రెండవ భారతీయుడు ఆయన. ఈ మిషన్ దాదాపు 2 వారాల పాటు కొనసాగుతుంది, అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం.