ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి లాయర్ల వినతి

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి లాయర్ల వినతి

 ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయవ్యవస్థలోని అవకతవకలను సరిచేయాలని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రి స్వామి, నేషనల్ న్యాయవాద సమత సమితి అధ్యక్షులు, సీనియర్ హైకోర్టు న్యాయవాది పద్మారావు కోరారు. సోమవారం సిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నర్రి స్వామి మాట్లాడుతూ.. న్యాయవాదులు, పీపీలు, ఏపీపీలు, స్టాండింగ్ కౌన్సిల్స్ సమస్యలను పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

ఏజీపీలు, జీపీలు, స్టాండింగ్ కౌన్సిల్స్, పీపీలు, ఏపీపీల నియామకంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని కోరారు. ట్రాన్స్​ఫర్లలో అవకతవకలకు చోటు లేకుండా చూడాలన్నారు. జార్ఖండ్ లో మాదిరి న్యాయవాదులకు ఆరోగ్య బీమా, పింఛన్, జూనియర్ న్యాయవాదులకు రూ.5వేల స్టైఫండ్​ఇవ్వాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్​సీఎం రేవంత్​రెడ్డితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మహాలింగప్ప, వినోద్ కుమార్, రవీందర్, బీరయ్య, సామాజిక వేదిక నాయకులు శ్రీరామ్, ఎం.చంద్రశేఖర్ న్యాయవాదులు పాల్గొన్నారు.