
ఎల్బీనగర్, వెలుగు: విజయవాడ– హైదరాబాద్ హైవేపై సోమవారం కూడా భారీ వాహన రద్దీ నెలకొంది. దసరా తెల్లారి శుక్రవారం నుంచి మొదలైన ఈ రద్దీ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులతో పాటు ప్రైవేట్ వెహికల్స్, ట్రావెల్స్లో వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్లో దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ట్రాఫిక్ లో చాలా అంబులెన్స్లు చిక్కుకున్నాయి.
టికెట్ తీసుకోవడానికే గంట!
ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ జాతరను తలపించింది. జిల్లాల నుంచి వచ్చిన ప్రయాణికులు సిటీలోని తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రోను ఆశ్రయించడంతో కిక్కిరిసింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేయగా, టికెట్ కౌంటర్ నుంచి స్టేషన్ కింద కిలోమీటర్ వరకు క్యూ చేరింది. ఎస్కలేటర్లు ఆపేశారు. టికెట్ తీసుకోవడానికే గంట పట్టింది.
ఆ ప్రమాదంతోనే ఇంత ట్రాఫిక్
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇంత ట్రాఫిక్కు కారణమైందని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సిటీకి వచ్చే వాహనాలు అక్కడ ఆగిపోవడం, ఆ తర్వాత ఒక్కసారిగా కదలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎల్బీనగర్లో ఇద్దరు
ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలు, 65 మంది పోలీసులతో ట్రాఫిక్ను డైవర్ట్ చేసి త్వరగా క్లియర్ చేసినట్లు తెలిపారు.