
- బీఆర్ఎస్లో రచ్చకెక్కుతున్న గ్రూపుల లొల్లి
కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. మరో ఏడాది పదవీకాలం పాటు ఉన్న సొసైటీలు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలపై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కొన్ని పాలకవర్గాలపై అవిశ్వాసాలు ప్రతిపాదిస్తూ ఆఫీసర్లకు లేఖలు అందాయి. గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీంతో బీఆర్ఎస్కు చెందిన లీడర్లే మున్సిపాలిటీలు, సొసైటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా కొనసాగుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించగా, మిగిలిన ఏడు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ దక్కించుకున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలపై అసంతృప్తి పెలుబుకుతోంది. తమ పార్టీకి చెందిన చైర్మన్లు, వైస్చైర్మన్లపై అవిశ్వాసాలకు తెరలేపుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల సొసైటీ చైర్మన్ నల్లవెల్లి అశోక్, వైస్ చైర్మన్ ఆముదాల రమేశ్పై సొంత పార్టీ సభ్యులే జిల్లా సహకార ఆఫీసర్కు ఇటీవల అవిశ్వాస లేఖ ఇచ్చారు.
వారికి కాంగ్రెస్, సీపీఐకి చెందిన ఒక్కో సభ్యుడు మద్దతు ప్రకటించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినీత (బీఆర్ఎస్)పై సొంత పార్టీకే చెందిన 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఆయా చోట్ల సొంత పార్టీ లీడర్ల మధ్య కుమ్ములాటలే అవిశ్వాసాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డి జడ్పీలోనూ..
కామారెడ్డి జడ్పీ చైర్మన్ దఫేదర్ శోభపై కూడా అవిశ్వాసం పెట్టేందుకు ఇటీవల పలువురు జడ్పీటీసీలు ప్రయత్నించారు. ఈ నెల 8న జడ్పీ మీటింగ్ జరిగింది. అంతకు మూడు రోజల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు జడ్పీటీసీలు కామారెడ్డి సమీపంలోని ఓ ఫామ్హౌజ్లో సమావేశమయ్యారు. చైర్పర్సన్పై అవిశ్వాస అంశంపై చర్చించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీలను బుజ్జగించారు.