
- రిజర్వేషన్ల కోసం ఆశావహుల ఎదురుచూపులు
- ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల వద్దకు క్యూ
ఖమ్మం/ ఖమ్మం టౌన్/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలపై పొలిటికల్ పార్టీలతో పాటు, ఆశావహులు ఫోకస్ పెట్టారు. రిజర్వేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారు, రిజర్వేషన్ల కోటా ఎలా ఉంటుందనే అంశంలో క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే టికెట్ల కోసం స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతున్నారు. అన్నీ కలిసి వస్తే తమకే అవకాశం ఇవ్వాలంటూ విన్నవించుకుంటున్నారు. అదే సమయంలో లీడర్లు కూడా కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఎలక్షన్ల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలను ముఖ్య నేతలు మోటివేట్ చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల గెలుపు బాధ్యతలను ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో సమన్వయం చేసుకుంటూ ఆయా వర్గాలను సంతృప్తి పరుస్తూ టికెట్లు కేటాయించడం ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరికి కత్తి మీద సాముగా మారనుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో దాదాపు ఏకపక్షంగా సీట్లను సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మెజార్టీ స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్థానిక సంస్థల్లో అయినా సత్తా చూపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుండగా, కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీజేపీ బలం నిరూపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.
రిజర్వేషన్లు ఎట్లుంటయో...
ఖమ్మం జిల్లాలో కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత 20 మండలాల పరిధిలో 571 పంచాయతీలు, 287 ఎంపీటీసీలు, 20 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల కోసం 1,569 పోలింగ్ కేంద్రాలను గుర్తించి, మ్యాపింగ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత 471 పంచాయతీలు,4168 వార్డులతో పాటు 236 ఎంపీటీసీలు, 22 జడ్పీటీసీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఆఫీసర్లు సన్నద్ధమవుతున్నారు.
బ్యాలెట్ పేపర్లతో పాటు బ్యాలెట్బాక్స్లు, పోలింగ్ ఆఫీసర్లు, సిబ్బందిని ఆఫీసర్లు ఇప్పటికే రెడీ చేసుకున్నారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా రిజర్వేషన్లను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల విషయంలో హైకోర్టు ఆదేశాలతో ఆశావహుల్లో కదలిక మొదలైంది. రిజర్వేషన్లు ఎట్లుంటయో అనే అంశంపై పార్టీల ముఖ్య నేతలతో పాటు ఆఫీసర్లతో మంతనాలు సాగిస్తున్నారు.
గతంలో ఉన్న రిజర్వేషన్లు ఎట్ల మారే అవకాశం ఉంది అనే విషయమై సీనియర్ నేతలతో ఆశావహులు చర్చలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లపై ఆశావహులు దృష్టి సారించారు. సర్పంచ్లతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీల రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో అనే టెన్షన్ బీసీ నేతల్లో నెలకొంది. కాగా, ఈ ఏడాది జనవరి 5న ప్రకటించిన ఓటర్ల ఫైనల్ లిస్టు ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఫిబ్రవరిలో రూపొందించారు.
అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏర్పాటయిన కొత్త మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను తప్పించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేసి ఎన్నికల సంఘానికి పంపించారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 289 ఎంపీటీసీలకు గాను 168 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 58 చోట్ల, సీపీఎం 14, సీపీఐ 7, టీడీపీ 5, ఇండిపెండెంట్లు 37 చోట్ల గెలిచారు. జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలుండగా బీఆర్ఎస్ 17 సీట్లను గెల్చుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది.