అసెంబ్లీ సీట్లపై.. వారసుల గురి

అసెంబ్లీ సీట్లపై.. వారసుల గురి

నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లాలో సీనియర్​ లీడర్ల వారసులు పొలిటికల్ ఎంట్రీకి ఆరాటపడుతున్నారు. పార్టీ హైకమాండ్​ అవకాశమిస్తే, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీకి కు సిద్ధంగా ఉన్నారు.  

డి.శ్రీనివాస్​కొడుకు సంజయ్.. 

రాష్ట్ర రాజకీయాల్లో డి.శ్రీనివాస్​ పరిచయం అక్కర్లేని పేరు. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం ఆయన పాలిటిక్స్​లో యాక్టివ్​గా లేరు.  శ్రీనివాస్​ చిన్న కొడుకు ధర్మపురి అర్వింద్​(బీజేపీ) నిజామాబాద్​ఎంపీగా ఉన్నారు. శ్రీనివాస్​ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెద్ద కొడుకు సంజయ్​నగర మేయర్​గా పనిచేశారు. కార్పొరేషన్​ మొదటి మేయర్​గా సంజయ్​ గుర్తింపు పొందారు. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అర్బన్ ​నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు.

జగన్​కోసం బాజిరెడ్డి రెడీ..

నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​3 దశాబ్దాలుగా పాలిటిక్స్​లో కొనసాగుతున్నారు. ఈయన ఆర్మూర్, బాన్సువాడ నియోజకర్గాల నుంచి ఒక్కోసారి, రూరల్​ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచారు.​ మాజీ ఫైనాన్స్​మినిస్టర్​ శనిగరం సంతోష్​రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్​లో చేరిన బాజిరెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్​లో కొనసాగుతున్నారు. తన కొడుకు బాజిరెడ్డి జగన్​ను అసెంబ్లీకి పంపాలనుకుంటున్నారు. కొడుకు కోసం ఓసీ జనరల్​కు రిజర్వ్​చేసిన జడ్పీ చైర్మన్​ పదవిని ఆశించి ధర్పల్లి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయించి, గెలిపించారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ పదవి విఠల్​రావుకు దక్కింది. లోకల్​బాడీ ద్వారా పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చిన జగన్,​ అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. అధిష్టాన నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.

అన్నపూర్ణమ్మ వారసుడిగా మల్లికార్జున్​రెడ్డి..

బాల్కొండ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న డాక్టర్​ మల్లికార్జున్​రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఏలేటి మహిపాల్​రెడ్డి 80వ దశకంలో మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణంతో  భార్య ఏలేటి అన్నపూర్ణ రాజకీయాల్లోకి వచ్చి, ఆర్మూర్​నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పదేండ్ల కింద జరిగిన నియోజకవర్గాల బైఫరికేషన్​ తర్వాత ఆర్మూర్​లోని మండలాలు బాల్కొండలో కలిశాయి. బాల్కొండ నియోజకవర్గం నుంచి కొడుకు మల్లికార్జున్​రెడ్డిని అసెంబ్లీకి పంపాలని ఆమె
 ఆశిస్తున్నారు.  

బాన్సువాడలో అన్నదమ్ముల మధ్య పోటీ

స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన రవీందర్​రెడ్డి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తిలేదు. రెండో కొడుకు సురేందర్​రెడ్డి, మూడో కొడుకు భాస్కర్​రెడ్డి తండ్రి వారసత్వాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ అయిదేండ్లుగా యాక్టివ్​ పాలిటిక్స్​లో ఉన్నారు. శ్రీనివాస్​రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి భాస్కర్​రెడ్డికి డీసీసీబీ చైర్​లో కూర్చోబెట్టారు. సురేందర్​రెడ్డికి లైన్​క్లియర్​ చేశారని అంతా భావించగా, ఇప్పుడు విషయం మళ్లీ మొదటికొచ్చింది. కొడుకులిద్దరూ తగ్గకుండా పోటీకి సై అనడం తండ్రికి తలనొప్పిగా మారింది. ఇంటెలిజెన్స్ ​ద్వారా పార్టీ అధినేత  కేసీఆర్​ దృష్టికి విషయం చేరడంతో ఈసారి పోచారం శ్రీనివాసరెడ్డినే బాన్సువాడ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇద్దరు కొడుకుల్లో ఏకాభిప్రాయం వస్తే క్రియాశీల రాజకీయాలకు విరామం ఇవ్వాలని శ్రీనివాస్​రెడ్డి యోచిస్తున్నారు.  

తండ్రికి లభించని ఛాన్స్​కొడుకుకి..

బాల్కొండ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రశాంత్​రెడ్డి తండ్రి సురేందర్​రెడ్డికి ఆర్మూర్​నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలనే బలమైన కోరిక ఉండేది. సురేందర్​రెడ్డికి స్వయాన చెల్లెలు అయిన ఏలేటి అన్నపూర్ణమ్మ అక్కడ బలమైన నాయకురాలిగా చెలామణిలో ఉండడంతో సురేందర్​రెడ్డి కల నెరవేరలేదు. తండ్రికి లభించని అవకాశాన్ని మంత్రి ప్రశాంత్​రెడ్డి పొందారు.