హైదరాబాద్, వెలుగు: ఏపీ తరహాలో తెలంగాణలో టీచర్లకు శాశ్వత ప్రాతిపదికన బదిలీల చట్టాన్ని తీసుకురావాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి, ఆరు నెలల్లోపు దాని సిఫారసులను అమలు చేయాలని కోరారు.
రెండు దశాబ్దాలుగా పెండింగ్లోని టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని, బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను, వివిధ రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. సెప్టెంబర్ లో సంఘం 80వ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ, పర్వత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పోల్ రెడ్డి, రాధ జయలక్ష్మి నాయకులు పాల్గొన్నారు.
