
- తనిఖీలు చేసిన కలెక్టర్లు
జగిత్యాల టౌన్, వెలుగు: లైసెన్స్ సర్వేయర్, గ్రామపాలన అధికారి పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశౄయి. జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన లైసెన్స్ సర్వేయర్ ఎగ్జామ్కు 148 అభ్యర్థులకు గానూ 127 మంది హాజరవగా.. గ్రామ పాలన అధికారి ఎగ్జామ్కు 29 మందికి గానూ 21 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.
యూరియా నిల్వల తనిఖీ
జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను పరిశీలించారు. ఎరువుల అమ్మకం కొనుగోళ్లకు సంబంధించిన రికార్డుల్లో ఆధార్ వివరాలను నమోదు చేయాలన్నారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు సప్లై చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: గ్రామ పాలన అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ హైస్కూల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యర్థుల హాజరుపై ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 39 మందికి గానూ 35 మంది హాజరయ్యారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు గానూ 141 మంది, మధ్యాహ్నం జరిగిన ప్లాటింగ్ ఎగ్జామ్కు 139 మంది హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు.