
న్యూఢిల్లీ: జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు ఆమెకు ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్లపై 18% జీఎస్టీ విధిస్తున్నారని, బీమాపై ట్యాక్స్ వేయడం వల్ల ఈ రంగం అనుకున్నంతగా వృద్ధిని సాధించడం లేదని లేఖలో తెలిపారు.
బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడంతో ప్రధానంగా సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన అభ్యర్థనను ఆయన లేఖలో ప్రస్తావించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్పై 18 శాతం జీఎస్టీ విధించడం అనేది జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.