- రక్షణ శాఖ భూములు అప్పగించిన కేంద్రం
- సీఎం చొరవతో స్పందించిన సర్కారు
- 3,380 చదరపు గజాల ఢిపెన్స్
- భూమి ఇచ్చేందుకు ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచేవాళ్ల భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు చాలారోజులుగా ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో అడుగు ముందుకుపడలేదు. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటంతో స్కై వాక్ పనులు నిలిచిపోయాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే మెహిదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు రక్షణ శాఖ మంత్రిని కలిసి ఈ అంశంపై రిప్రజెంటేషన్ ఇచ్చారు.
దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడున్న ఢిఫెన్స్ జోన్ కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కై వే డిజైన్ లో సీఎం పలు మార్పులు చేయించారు. సవరించిన ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. స్కై వే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనుంది.
బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి పదేండ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహదీపట్నం స్కై వాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. ముంబాయి హైవే లో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. వీలైనంత వేగంగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను రేవంత్ ఆదేశించారు.