
ఆర్టీసీ సమ్మె జరగుతుండగా జరిగిన కార్మికుల ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలకు ప్రభుత్వ తీరే కారణమని ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు వేసిన పిల్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాధారణ మరణాలకు, ప్రభుత్వానికి లింక్ పెట్టడం సరికాదని బుధవారం ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సమ్మె అంశంపై యూనియన్తో సర్కార్ చర్చలు జరపేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో కోరారని, అయితే ఇప్పటికే హైకోర్టు సమ్మె విషయాన్ని లేబర్ కోర్టే తేల్చాలని చెప్పిందని, దీంతో పిల్ను కొట్టేయాలని సీఎస్ పేర్కొన్నారు.
మరణాలకు గల కారణాలను దర్యాప్తు సంస్థలే తేల్చాల్సి ఉంటుందని తెలిపారు. పిల్లో లేనిపోని ఆరోపణలు చేసి సర్కార్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద సమ్మె వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినందున పిల్పై విచారణ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్పై ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరుగనుంది.