- డిసెంబర్ ఒక్క నెలలో సర్కారుకు రూ. 3 వేల కోట్ల ఆమ్దానీ
- పోయినేడాది రూ.2,750 కోట్ల మద్యం అమ్మకాల రికార్డ్ బ్రేక్
- బీర్లు, ఐఎంల్ సేల్స్ కూడా పెరిగినయ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ఆల్టైం రికార్డ్ బ్రేక్ చేశాయి. ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. ఈ నెలలో ఏకంగా రూ. 3,040 కోట్ల విలువైన మద్యం ఆయా డిపోల నుంచి సరఫరా అయింది. ఇయర్ఎండింగ్ దృష్ట్యా మరో రూ. 300 కోట్ల ఆదాయం రావచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులతోపాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్ లు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క నెలలో గరిష్టంగా నిరుడు డిసెంబర్లో 2,765.5 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడైంది. ఇందులో 34 లక్షల కేసుల ఐఎంఎల్(ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్), 27 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఈ సారి డిసెంబర్లో బుధవారం వరకు రూ. 3040 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 36 లక్షల ఐఎంఎల్ కేసులు, 29.6 లక్షల కేసుల బీర్లు సేల్కావడం గమనార్హం. నిరుటితో పోలిస్తే ఈ సారి బీరు, ఐఎంఎల్ సేల్స్ పెరిగాయి.
బార్లు, వైన్స్ పెరగడంతోనే..
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆమ్దానీ బాగా వస్తుండటంతో సర్కారు లిక్కర్సేల్స్ను మరింత ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాలు చాలవన్నట్లు ఇటీవల మరో 404 వైన్స్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతకుముందు కొత్తగా159 బార్లను నడిపేందుకు లైసెన్స్లు మంజూరు చేసింది. మద్యం దుకాణాల టైమింగ్ పెంచింది. దీంతోపాటు సేల్స్ పెంచాలని ఎప్పటికప్పుడు ఆబ్కారీ శాఖ అధికారులను పురమాయిస్తోంది. వాళ్లు మద్యం వ్యాపారులను వేధిస్తున్నారు. మరోవైపు ఇబ్బడిముబ్బడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోంది. ఇక చలి కాలం కావడం కూడా ఓ కారణంగా అధికారులు చెబుతున్నారు. దీంతో సర్కారుకు మస్తు ఆదాయం వస్తోంది.