రాష్ట్రంలో మద్యంకు ఫుల్ డిమాండ్ పెరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు ఏకంగా 24 వేల 814 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోయింది. ఇందులో వ్యాట్ పోగా 15 వేల కోట్లకు పైగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చింది. 11 నెలల కాలంలో 2 కోట్ల 40 లక్షల కేసుల బీర్లు, మూడు కోట్ల కేసులకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి.
కరోనా టైంలో రాష్ట్ర ప్రజలతో పాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. అయితే ఎక్సైజ్ ఆదాయ అంచనాలు మాత్రం టార్గెట్ ను చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రాబడుల కింద 16వేల కోట్లు సమకూర్చుకోవాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకోగా… మరో నెల గడువు ఉండగానే 15 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మార్చిలో మిగతా వెయ్యి కోట్లకన్నా ఎక్కవే రాబడి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
గతేడాది లాక్ డౌన్ టైంలో మార్చి 22 నుంచి మే 6వ వరకు 46 రోజుల పాటు మద్యం విక్రయాలు జరగలేదు. ఆ టైంలో కూడా వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంటే మరో 2 వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వచ్చేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 28 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్ అమ్ముడయ్యాయి. వీటి విలువ 2 వేల 727 కోట్లు. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం, ఇతర కారణాలతో డిపోల నుంచి మద్యం కొంత తక్కువ వెళ్లింది. జనవరి కంటే 3 లక్షల కేసుల లిక్కర్, 5 లక్షల కేసుల బీర్లు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే మార్చిలో మద్యం విక్రయాలు మళ్లీ పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.