- అన్ని లోన్ల సెగ్మెంట్లలోనూ భారీ గ్రోత్
- వెల్లడించిన ఆర్బీఐ రిపోర్టు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఎకానమీకి ఎంతో ముఖ్యమైన క్రెడిట్ గ్రోత్ పుంజుకుంటోంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు అప్పులివ్వడం పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణం మామూలు జనం విపరీతంగా అప్పులు తీసుకోవడమే! పండగ సీజన్ రావడంతో పాటు తక్కువ వడ్డీకే లోన్లు దొరుకుతుండటంతో , రిటెయిలర్లు ఫైనాన్షియల్ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం బాగా పెరిగింది. మరోవైపు కంపెనీలు తీసుకునే లోన్లు ఇంకా రికవరీ కాలేదు. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, ఈ ఏడాది నవంబర్ 5 నాటికి, ఫుడ్ కోసం కాకుండా మిగిలిన వాటికి ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన అప్పులు రూ. 110.9 లక్షల కోట్లకు పెరిగాయి. కిందటేడాది ఇదే టైమ్తో పోలిస్తే ఫైనాన్షియల్ సంస్థలిచ్చిన ఇటువంటి లోన్లు 7.3 శాతం పెరగడం విశేషం. అదే ఈ ఏడాది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 5 మధ్య ఆహారేతర లోన్లు రూ. 1.35 లక్షల కోట్లు పెరిగాయి. లోన్లను ఇవ్వడానికి ఫైనాన్షియల్ సంస్థలు ముందుకొస్తుండడంతో పాటు పండగ సీజన్ కూడా కలిసొచ్చిందని ఎనలిస్టులు చెబుతున్నారు. కరోనా తర్వాత వ్యవస్థలో ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చే లోన్లు ఊపందుకోవడం ఇదే మొదటిసారి. ‘లోన్లను తీసుకోవడానికి జనాలు వస్తున్నారు.రిటెయిల్ లోన్ల సెగ్మెంట్లో డిమాండ్ రికవర్ అవ్వడాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా మార్టిగేజ్ (తనఖా) లోన్లు తీసుకోవడానికి జనాలు ముందుకొస్తున్నారు. కార్ లోన్లు స్టార్టింగ్లో బాగానే ఉన్నా ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. గ్లోబల్గా చిప్ల కొరత ఉండడంతో కార్ల అమ్మకాలు తగ్గుతుండడమే కారణం’ అని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి అన్నారు. కిందేటేడాది ఏప్రిల్లో క్రెడిట్ గ్రోత్ (అప్పులివ్వడం) 7 శాతంగా నమోదయ్యింది. ఆ తర్వాత నుంచి నవంబర్ వరకు ఈ లెవెల్ను టచ్ చేయలేదని సీనియర్ బ్యాంకర్ ఒకరు ఈ సందర్భంగా వివరించారు.
భారీగా రిటైల్ లోన్స్..
క్రెడిట్ గ్రోత్ పెరగడానికి ప్రధాన కారణం రిటెయిల్ లోన్స్ పెరగడమేనని పైన పేర్కొన్న బ్యాంకర్ అన్నారు. పర్సనల్ లోన్స్, ఆటోమొబైల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇవ్వడం పెరిగిందని అన్నారు. హోమ్ లోన్స్ కరోనా ముందు స్థాయికి పెరిగాయని చెప్పారు. ‘గ్రౌండ్ లెవెల్లో ఉన్న మా స్టాఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే..ఈ సారి అప్పులకు డిమాండ్ పెరిగింది. ఇది ఇలానే కొనసాగుతుందని అనిపిస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటెయిల్ లోన్స్ మరింత పెరుగుతాయి’ అని పేర్కొన్నారు. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కరోనా టైమ్ నుంచే రిటెయిల్ లోన్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. కానీ, కరోనా సంక్షోభం వలన వినియోగం తగ్గింది. దీంతో రిటెయిల్ లోన్లపై ప్రభావం పడుతుందని అంచనావేశారు. కానీ, కరోనా టైమ్లో కూడా జనం (రిటెయిలర్లు) అప్పులు తీసుకోవడం పెరిగింది. ఎకానమీ రికవరీ అవుతుండడంతో లోన్లు ఇవ్వడం మరింత పెరుగుతుందని, ఈ క్రెడిట్ గ్రోత్ ఇలానే కొనసాగుతుందని ఎనలిస్టులు అంటున్నారు.
కంపెనీలు తీసుకునే లోన్లు పెరగలే!
కంపెనీలు తీసుకునే లోన్లు మాత్రం ఇంకా పుంజుకోలేదు. అవసరాల కోసం ఇంటర్నల్గా ఫండ్స్ను కంపెనీలు ఎరేంజ్ చేసుకుంటున్నాయి. దీంతో క్రెడిట్ గ్రోత్ పెరగడంలో రిటెయిల్ లోన్లు వెన్నెముకగా పనిచేస్తున్నాయి. వచ్చే ఆరు నెలల్లో కార్పొరేట్ సంస్థలు తమ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను స్టార్ట్ చేస్తాయని బ్యాంకర్లు అంచనావేస్తున్నారు. దీంతో కొత్తగా లోన్లు తీసుకోవడం పెరగుతుందని, ఇప్పటికే ఉన్న క్రెడిట్ లైన్లను వాడుకోవడం పెరుగుతుందని చెప్పారు. కార్పొరేట్ లోన్ సెగ్మెంట్ ఇప్పట్లో పుంజుకోకపోవచ్చని మరికొంత మంది బ్యాంకర్లు అన్నారు. చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఆస్తులను అమ్మి అప్పులను కొద్ది కొద్దిగా తీరుస్తున్నాయని, వీటి క్యాష్ బ్యాలెన్స్లు పెరుగుతున్నాయని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీస్ కుమార్ అన్నారు. దీంతో షార్ట్టెర్మ్లో కార్పొరేట్ లోన్ సెగ్మెంట్లో పెరుగుదల కనిపించకపోవచ్చని అన్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో కొత్తగా అప్పులు తీసుకునే వాళ్లు పెరుగుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా తనఖా లోన్లపై ఎప్పుడూ లేనంత తక్కువ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించడంతో పాటు, వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండడంతో తక్కువ వడ్డీకే లోన్లను ఇవ్వడానికి ఫైనాన్షియల్ సంస్థలు ముందుకొస్తున్నాయి. కీలక రేట్లను ఇప్పట్లో పెంచే ఆలోచనలో ఆర్బీఐ లేదు. దీంతో మరికొంత కాలం పాటు లోన్లు తక్కువ వడ్డీకే దొరుకుతాయని అంచనా.