
న్యూఢిల్లీ: ధనత్రయోదశి సందర్భంగా 50 వేలకు పైగా కార్లను అమ్మే అవకాశం ఉందని మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ పండుగను శని–ఆదివారం రెండు రోజులు జరుపుకుంటున్నారు. దీంతో మారుతి శనివారం 41 వేల డెలివరీలు, ఆదివారం మరో 10 వేల డెలివరీలు జరుపుతామని ప్రకటించింది. గత ఏడాది 41,500 కార్లు విక్రయాలు నమోదయ్యాయని పేర్కొంది.
హ్యుందాయ్ కూడా 14 వేల డెలివరీలతో ఏడాది లెక్కన 20శాతం వృద్ధిని నమోదు చేసింది. జీఎస్టీ 2.0 ప్రభావంతో వినియోగదారుల ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 18 నుంచి మారుతి ధరలు తగ్గించడంతో 4.5 లక్షల బుకింగ్స్ వచ్చాయి.
ఇందులో 94 వేలకు పైగా చిన్న కార్లు ఉన్నాయి. ఈ ఒక్క నెలలో మొత్తం 3.25 లక్షల యూనిట్ల రిటైల్ అమ్మకాలు జరిపామని మారుతి పేర్కొంది. పానాసోనిక్, హయర్ వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్లు కూడా ధనత్రయోదశి అమ్మకాలలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి.
55 అంగుళాల పైగా టీవీలు, రూమ్ ఏసీలు 30–50శాతం వృద్ధిని నమోదు చేశాయి. తనిష్క్లో రూ.2 లక్షల పైగా పెట్టుబడి కొనుగోళ్లు, తేలికపాటి ఆభరణాలు, బంగారు నాణేలు డిమాండ్లో ఉన్నాయి.