గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం ఏరియాలో మూసివేసిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ మట్టి గుట్టలపై పెద్దపులి సంచారం కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున మంచిర్యాల జిల్లా రామారావుపేట నుంచి గోదావరి నది మీదుగా రామగుండం ఏరియాలోని మేడిపల్లి ఓసీపీ పరిసరాల్లోకి పులి వచ్చినట్టు పాద ముద్రల ఆధారంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
అధికారులు దానిని మగ పులిగా భావిస్తున్నారు. మహారాష్ట్రలోని తడోబా ఫారెస్ట్ నుంచి తెలంగాణలోని జన్నారం కవ్వాల్ అటవీ ప్రాంతం గుండా తిరుగుతూ రెండు రోజుల కింద మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో సంచరించిందని, ఆ తర్వాత రామారావుపేట శివారు గుండా ఆదివారం తెల్లవారుజామున నది దాటి మేడిపల్లి ఓసీపీ ప్రాంతానికి చేరుకుందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సీహెచ్ శివయ్య తెలిపారు.
పెద్దపులి రోజుకు కనీసంగా 20 కిలోమీటర్ల దూరం నడుస్తుందని, పులి జాడను తెలుసుకునేందుకు నాలుగు చోట్ల కెమెరా ట్రాకర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ఆఫీసర్లు జి.కొమురయ్య, పి.దేవదాస్, స్ట్రైక్ ఫోర్స్ రహ్మతుల్లా, ఎ.వాయుకుమార్, జి.రామ్మూర్తి, స్రవంతి, సింగరేణి జూనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు.
