
- 60 శాతం వాటా డీల్ విలువ రూ.26,580 కోట్లు
న్యూఢిల్లీ: యూఏఈలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎమిరేట్స్ ఎన్బీడీ, ఆర్బీఎల్ బ్యాంక్లో మెజారిటీ వాటా కోసం రూ.26,580 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.280 షేర్ ధరకు 60శాతం వాటాను సంస్థ కొనుగోలు చేస్తోంది. ఈ పెట్టుబడి తరువాత 26శాతం అదనపు వాటా కోసం ఓపెన్ ఆఫర్కు కూడా కంపెనీ వెళ్లనుంది. అయితే విదేశీ పెట్టుబడికి సెబీ 74శాతం పరిమితి విధించినందున, ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయితే, ఎమిరేట్స్ ఎన్బీడీ తన వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది.
ఆర్బీఎల్ పూర్తిగా పబ్లిక్ ఓన్డ్ బ్యాంక్. ప్రస్తుతం ఇందులో విదేశీ వాటా 22శాతం ఉంది. ఎమిరేట్స్ ఎన్బీడీ పెట్టుబడి తర్వాత వీరి వాటా 11శాతానికి డైల్యూట్ అవుతుంది. ఈ డీల్ పూర్తయిన తర్వాత ఇది భారత బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద మెర్జర్ అండ్ అక్విజేషన్గా నిలవనుంది. ఆర్బీఎల్ షేర్లు గత నెలలో 11శాతం పెరిగాయి. 2025లో ఇప్పటివరకు 89శాతం పెరిగి, లిస్టెడ్ బ్యాంక్ స్టాక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చూపాయి.
ఆర్బీఎల్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బీడీ.. ఇరు సంస్థలు శనివారం ఒప్పందంపై సంతకం చేశాయి. బ్యాంక్ మేనేజ్మెంట్ కొనసాగుతుందని, కానీ బోర్డు సభ్యుల్లో 50శాతం మందిని ఎమిరేట్స్ ఎన్బీడీ నియమిస్తుందని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. కాగా, యూఏఈ నుంచి 2023–24 లో వచ్చిన రెమిటెన్స్లలో సగం ఆర్బీఎల్ ద్వారా వచ్చాయి.