రేపటి (సోమవారం) నుంచి రాష్ట్రాల మధ్య బస్సు ప్రయాణాలకు కేంద్రం అనుమతిచ్చింది. కరోనా లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల యాక్టివిటీస్ కు అనుమతి ఇచ్చింది. అయితే స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు, స్మిమ్మింగ్ పూల్స్, జిమ్స్, ఆలయాలు, ప్రార్థనా స్థలాలు వంటివి మాత్రం దేశమంతా క్లోజ్ చేసి ఉంచాలని ఆదేశించింది.
పరిశ్రమలు, కంపెనీలకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం లాక్ డౌన్ 4.0లో బస్సు సర్వీసులు నడిపేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రం లోపల బస్సులు, ఇతర ప్యాసింజర్ వాహనాలన్నీ నడపవచ్చని తెలిపింది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. అలాగే ఇతర రాష్ట్రాలకు బస్సు ప్రయాణాలకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పరస్పరం ఆయా రాష్ట్రాల మాట్లాడుకుని ఓకే అనుకుంటే బస్సులు నడుపుకోవచ్చని చెప్పింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం, సోఫల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని చెప్పింది. 65ఏళ్ల వయసు పైబడిన వాళ్లు, పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వీరు ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరింది. కాగా, రాష్ట్రాల మధ్య కార్గో వాహనాలను మాత్రం అడ్డగించొద్దని ఆదేశించింది కేంద్ర హోం శాఖ.