ఇవాళ ఆరో విడత ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో పోలింగ్

ఇవాళ ఆరో విడత ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో పోలింగ్
  • ఆరో విడతలో 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో పోలింగ్
  • ఢిల్లీలో క్లీన్ స్వీప్​పై కన్నేసిన బీజేపీ
  • కూటమిగా బరిలో ఆప్, కాంగ్రెస్
  • 1.52 కోట్ల మంది ఓటర్లు.. 13వేల పోలింగ్ కేంద్రాలు

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని ఏడు లోక్​సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనున్నది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్నది. కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నది. కాగా, బీజేపీ మొత్తం ఏడు స్థానాల్లో బరిలో ఉన్నది. 2014, 2019లో ఢిల్లీలో  జరిగిన జనరల్ ఎలక్షన్స్​లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురిని తప్పించి కొత్తవారికి చాన్స్ ఇచ్చింది. దీంతో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

డ్రోన్లతో పోలింగ్ సరళి పరిశీలన

ఢిల్లీ వ్యాప్తంగా 2,627 చోట్ల 13వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఎన్నికలు అధికారులు ప్రకటించారు. 60 వేల మంది పోలీసులను మోహరించారు. డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఈసీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. 44 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశాలు ఉండటంతో.. పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఢిల్లీ సీఈవో పి.కృష్ణమూర్తి తెలిపారు. 

జైలు నుంచి వచ్చి కేజ్రీవాల్ ప్రచారం

లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయి 50 రోజుల తర్వాత మే 10న బెయిల్​పై బయటికొచ్చిన ఆప్ కన్వీనర్  అర్వింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.

రాజధానిలో గెలుపుపై బీజేపీ ధీమా

ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నరు. వికసిత్ భారత్ లక్ష్యం ప్రజల్లోకి వెళ్లిందని, భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ తరఫున కేజ్రీవాల్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సోనియా, రాహుల్, కేజ్రీవాల్, హర్దీప్ సింగ్ పూరి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బరిలో 889 మంది..

ఆరో ఫేజ్ లోక్​సభ ఎన్నికల్లో భాగంగా 58 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్​లోని అనంత్​నాగ్ – రాజౌరీ సెగ్మెంట్​కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒడిశా, వెస్ట్ బెంగాల్​లోని పలు అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనున్నది. ఆరో ఫేజ్​లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఢిల్లీలో 7, బిహార్​లో 8, యూపీలో 14, జమ్మూ కాశ్మీర్​లో ఒకటి, హర్యానాలో 10, ఒడిశాలో 6, వెస్ట్ బెంగాల్​లో 8, జార్ఖండ్​లో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.