దన్వేకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మందలింపు
సభలో అటెన్షగా ఉండండి సభ్యులడిగే ప్రశ్నల్ని ఓపిగ్గా వినండి
న్యూఢిల్లీ: కన్జూమర్స్ ఎఫైర్స్ సహాయమంత్రి రావుసాహెబ్ పాటిల్ దన్వే పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు. హౌస్ ప్రొసీడింగ్స్ పై శ్రద్ధపెట్టాలని ఆయనను మందలించారు. మంగళవారం క్వశ్చన్అవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన ఎంపీ హేమంత్ తుకారాం గాడ్సే సప్లిమెంటరీ ప్రశ్న వేసినప్పుడు..దానిని వినిపించుకోని మంత్రి మరొకసారి ఆ ప్రశ్నను రిపీట్చేయాల్సిందిగా సభ్యుడ్ని కోరారు. వెంటనే జోక్యం చేసుకున్న స్పీకర్… “మంత్రిగారు.. సభ్యులడిగే ప్రశ్నలపై శ్రద్ధపెట్టాలి. వాటిని జాగ్రత్తగా వినాలి” అని మందలించారు. “మీకు మరో చాన్స్ ఇస్తాను. మళ్లీ అదే క్వశ్చన్ మీరు అడగొద్దు”అని అన్నారు. అదే టైమ్లో శివసేన లీడర్ అర్వింద్ సావంత్ గాడ్సే సీటు దగ్గరకు వచ్చి స్పీకర్ ఏమన్నారో వివరించే ప్రయత్నం చేశారు. ‘‘సావంత్ జీ , గాడ్సేకు నేను ఏమన్నానో వివరించండి”అని స్పీకర్ కోరారు.
గాడ్సే వేసిన మరొక ప్రశ్నకు … మంత్రి దన్వేతోపాటు ఆఖరు వరుసలో కూర్చున్న కన్జూమర్ ఎఫైర్స్ మినిస్టర్ రామ్విలాస్ పాశ్వాన్ లేచి , సమాధానం చెప్పారు. తర్వాత సప్లమెంటరీ ప్రశ్నలకు కూడా పాశ్వానే సమాధానం చెప్పారు. స్పీకర్ వెంటనే ఎలర్ట్ అయి కూర్చొనే సమాధానం చెప్పండి అని పాశ్వాన్తో అన్నారు. “మీరు కూర్చొని సమాధానం చెప్పడానికి సభ కూడా అనుమతి ఇస్తుంది. మీ కాళ్లకు ఫ్రాక్చర్ అయింది కదా” అని బిర్లా గుర్తుచేశారు. అయినప్పటికీ పాశ్వాన్ నిలబడే సమాధానం చెప్పారు. “మీకు మళ్లీ చెబుతున్నా. కావాలనుకుంటే కూర్చొనే సమాధానం చెప్పొచ్చు. నిలబడితే మీ కాళ్ల నొప్పులు పెరుగుతాయి కదా ”అని స్పీకర్ మరోసారి మంత్రికి నచ్చచెప్పారు.క్వశ్చన్ అవర్ లో సప్లిమెంటరీ ప్రశ్నల్ని అడగడానికి పేర్లు ఇచ్చి సభకు రాని ఎంపీలపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సప్లిమెంటరీ పశ్నలు అడుగుతామని పేర్లు ఇచ్చి, సభకు రానివాళ్లకు వింటర్ సెషన్లో ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి అనుమతించబోమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.
బీజేపీ ఎంపీలకు రాజ్ నాథ్ వార్నింగ్
త్వరలో ప్రవేశపెట్టనున్న సిటిజన్షిప్ (సవరణ) బిల్లు సమయంలో సభ్యులందరూ పార్లమెంట్కు హాజరుకావాలని పార్టీ ఎంపీలను డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కోరారు. ఆ టైమ్లో ఎవరూ పార్లమెంట్కు బంక్ కొట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు.ఆర్టికల్ 370 రద్దు బిల్లులాగే సిటిజన్షిప్ (సవరణ) బిల్లుకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నదని గుర్తుంచుకోవాలన్నారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఎంపీలు పార్లమెంట్కు తరచూ రానందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీరియస్గా ఉన్న విషయాన్ని ఎంపీల దృష్టికి కేంద్రమంత్రి తీసుకొచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ప్రధాని ఈ మీటింగ్కు రాలేదు.
బుధవారం కేబినెట్లో సిటిజన్ షిప్ బిల్లుకు క్లియరెన్స్ వచ్చే అవకాశముందని, ఆతర్వాత దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నందున ఎంపీలంతా సభలకు హాజరుకావాలని రాజ్నాథ్ కోరారు. పార్లమెంట్లో హుందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షాలను కించపరిచేలా కామెంట్స్ చేయొద్దని సూచించారు. సభలో దూకుడు ప్రదర్శించినా కాంగ్రెస్ మాదిరిగా అగ్రెస్వ్గా ఉండొద్దని రాజ్నాథ్ కోరారు. నాథురామ్ గాడ్సేపై ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన కామెంట్స్, ఆ తర్వాత ఆమె లోక్సభకు సారీ చెప్పిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఎంపీలకు ఈమేరకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమైన బిల్లులు సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఎంపీలు సభలకు హాజరుకావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ కోరారు.