
యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారం(మే15)తో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో సామాన్య ప్రజానీకం సమస్యలను వింటూ..మీకు అండగా ఉంటానని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని భరోసానిస్తూ లోకేష్ ముందుకు సాగారు. ప్రభుత్వం నిలిపివేసిన పనుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ రాష్ట్ర మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు.
జనవరి 27 చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకర్గంలో వంద రోజులకు చేరుకుంది. లోకేష్ పాదయాత్రకు మద్దతుకు ఆయన తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు యాత్రలో పాల్గొన్నారు. దారి మధ్యలో భువనేశ్వరి షూలేస్ ఊడిపోవడంతో తన తల్లి పాదాలను నమస్కరించి లేస్ కట్టారు. యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతుకూరు వద్ద పైలాన్ను ఆవిష్కరించారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాదయాత్ర చేపట్టారు.
శ్రీశైలం నియోజకవర్గంలో సాగిన 100 వ రోజు పాదయాత్రలో సంత జూటూరు వద్ద చెంచులతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేష్. పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తామని, ఆర్డిటి లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఐటిడిఎలను ప్రక్షాళన చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చెంచులకు విద్యను చేరువ చేసేందుకు వారినే ఉపాధ్యాయులుగా నియమిస్తామన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
పాదయాత్ర 100 వ రోజు బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో జాతరను తలపించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. సాయంత్రం యాత్ర ముగిసిన అనంతరం యువగళం వాలంటీర్లు, టీమ్ సభ్యులకు నారా భువనేశ్వరి స్వయంగా భోజనం వడ్డించారు.