
- 700 మంది మెరైన్లను మోహరించిన వైట్హౌస్
- మరో 2 వేల మంది నేషనల్ గార్డ్స్ను పంపిస్తానన్న ట్రంప్
- అధ్యక్షుడి చర్యలను ఖండించిన గవర్నర్ న్యూసమ్
- ఇమిగ్రేషన్ విధానాలకు అడ్డు తగిలితే అరెస్టేనని ట్రంప్ వార్నింగ్
- ఆందోళనలను కంట్రోల్ చెయ్యలేకపోయారని గవర్నర్పై విమర్శ
న్యూయార్క్: అక్రమ వలసదారుల ఏరివేత కోసం అమెరికా సర్కారు తీసుకుంటున్న బలవంతపు చర్యలకు వ్యతిరేకంగా లాస్ఏంజెల్స్లో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు ఇంకా ఆరలేదు. నాలుగోరోజూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసనలను నియంత్రించేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మరో 2 వేల మంది నేషనల్ గార్ట్స్ను లాస్ ఏంజెల్స్ కు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని వైట్హౌస్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. నగరంలో జరుగుతున్న నిరసనలను అడ్డుకుంటున్న నేషనల్ గార్డ్స్కు సహాయంగా ఇప్పటికే 700 మంది మెరైన్లను అమెరికా ప్రభుత్వం మోహరించింది. వీరు ఇమిగ్రేషన్ అధికారులను, దాని ఆస్తులను రక్షించే పనిలో ఉన్నారు. కాగా, ట్రంప్ తాజా ఆదేశాలతో లాస్ఏంజెల్స్లో మోహరిస్తున్న నేషనల్ గార్డ్స్ సంఖ్య 4వేలకు చేరనుంది.
ట్రంప్ చర్యలపై గవర్నర్ ఫైర్
లాస్ఏంజెల్స్కు మరో 2 వేల మంది నేషనల్గార్డ్స్ను పంపించాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మండిపడ్డారు. కేవలం 300 మందిని మాత్రమే ఇప్పటివరకూ వివిధ ప్రాంతాల్లో మోహరించారని, మిగతా వాళ్లంతా ఫెడరల్ బిల్డింగ్స్లో ఖాళీగా ఉన్నారని తెలిపారు. అనేక యుద్ధాల్లో సేవలందించిన మెరైన్లను.. ప్రెసిడెంట్ కోసం సొంత దేశస్తులకే వ్యతిరేకంగా పనిచేయించడం సరికాదని అన్నారు.
ఇది వారిని అగౌరపరచడమేనని మండిపడ్డారు. గార్డ్స్కు సరైన ఆహారం, నీరు వంటి సదుపాయాలను కూడా కల్పించలేదని విమర్శించారు. కాగా, నేషనల్ గార్డ్స్ ను మోహరించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా కోర్టుకెక్కాడు. లాస్ఏంజెల్స్లో నేషనల్ గార్డ్స్ మోహరింపు రాష్ట్ర
సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.
గవర్నర్ న్యూసమ్పై ట్రంప్ విమర్శలు
కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్పై ప్రెసిడెంట్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. దేశ ఇమిగ్రేషన్ విధానాలకు అడ్డు తగిలితే ఎవరినైనా సరే అరెస్టు చేస్తామని బోర్డర్ జార్ టామ్ హోమన్ వ్యాఖ్యలను సమర్థించారు. తాను టామ్ స్థానంలో ఉంటే అదేపని చేసేవాడినని అన్నారు. లాస్ఏంజెల్స్లో నెలకొన్న ఆందోళనలను కంట్రోల్ చేయడంలో గవర్నర్ న్యూసమ్, మేయర్ కరెన్బాస్ విఫలమయ్యారని విమర్శించారు.
అందుకే తాము అల్లర్లను ఎదుర్కొనేందుకు నేషనల్ గార్డులను మోహరించామని వెల్లడించారు. తాము ఇలా చేసి ఉండకపోతే లాస్ ఏంజెల్స్ సర్వనాశనం అయ్యేదని అన్నారు. ఇందుకు న్యూసమ్, కరెన్ బాస్ కృతజ్ఞతలు చెప్పాల్సింది పోగా.. ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.